లక్నో : ఒకప్పుడు కోడళ్లపై అత్తలు పెత్తనం చెలాయించేవారు. కానీ ప్రస్తుత కాలంలో కోడళ్లే అత్తలపై అహంకారం ప్రదర్శిస్తూ.. అగౌరవపరుస్తున్నారు. వేడి వేడి ఆహారం వడ్డించలేదని అత్తపై ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. గఘహా పోలీసు స్టేషన్ పరిధిలోని మంజ్గన్వాలో అత్త, కోడళ్లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. వీరిద్దరి భర్తలు ఉద్యోగాల రీత్యా వేరే ప్రదేశాల్లో ఉంటున్నారు. అయితే కోడలు ఏ మాత్రం అత్తకు సహాయం చేయకుండా కాలక్షేపం చేస్తోంది. వంట పనుల నుంచే మొదలుకుంటే అన్ని పనులు అత్తే స్వయంగా చేసుకుంటోంది. ఇటీవలే అత్త సమయానికి ఆహారం వడ్డించలేదని కోడలు పోలీసు హెల్ప్లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారింటికి చేరుకుని దర్యాప్తు చేశారు. తన అత్త టీవీ సీరియల్స్లో లీనమైపోతోందని, వేడి వేడి ఆహారం వడ్డించడం లేదని కోడలు పోలీసులకు చెప్పింది. దీంతో రోజురోజుకు తన ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపింది. ఆమె మాటలకు పోలీసులు షాక్ అయ్యారు. అత్త కూడా కోడలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వంటింటి పనుల్లో కోడలు సహాయం చేయడం లేదని అత్త కూడా ఆగ్రహించింది. ఇద్దరి వాదనలు విన్న పోలీసులు.. అత్తకోడళ్లను మందలించారు. ఇలాంటి చిన్న విషయాలకు పోలీసులకు ఫోన్ చేసి సమయం వృథా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.