అమరావతి : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ బయల్దేరి వెళ్ళారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుండి డెహ్రాడూన్ బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మర్గం ద్వారా రిషికేశ్ చేరుకున్నారు. చాతుర్మాస్య దీక్ష కోసం రిషికేశ్ వెళ్ళిన పీఠాధిపతులు అక్కడి గంగాతీరంలో ఉన్న విశాఖ శ్రీ శారదాపీఠం ఆశ్రమంలోనే సెప్టెంబరు నెలాఖరు వరకు బస చేస్తారు. రిషికేశ్ బయలుదేరే ముందు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణంలోనే దేవతామూర్తులను దర్శించుకున్నారు. రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
ప్రతిఏటా తన చాతుర్మాస్య దీక్షను పవిత్ర గంగానదీ తీరంలో చేపట్టాలని పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి సంకల్పించారు. ఈ ఏడాది జూలై 24వ తేదీన ప్రారంభమయ్యే దీక్ష సెప్టెంబరు 20వ తేదీ వరకు కొనసాగనుంది. పీఠం నిర్వహణలోని జగద్గురు ఆదిశంకరాచార్య వేద పాఠశాల విద్యార్థులు సైతం పీఠాధిపతులతో కలిసి ప్రత్యేక విమానంలో రిషికేశ్ వెళ్లారు.