తైపే, ఆగస్టు 6: తైవాన్ను అష్టదిగ్బంధంలో బంధించేందుకు చైనా ప్రయత్నాలను తీవ్రతరం చేసింది. తైవాన్ సమీపంలో 68 యుద్ధ విమానాలు, 14 యుద్ధ నౌకలను డ్రాగన్ దేశం మోహరించింది. 20 చైనా ఎయిర్ఫోర్స్ విమానాలు తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోని ఇప్పటికే ప్రవేశించాయని, 14 యుద్ధ నౌకలు తైవాన్ జలాల్లో విన్యాసాలు నిర్వహించినట్టు తైవాన్ రక్షణశాఖ పేర్కొన్నది.
చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో కొరియన్ ఎయిర్, సింగపూర్ ఎయిర్లైన్స్తో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. తైవాన్ సమీపంలో చైనా సైనిక, యుద్ధ విమానాల విన్యాసాలు కొనసాగుతున్న నేపథ్యంలో తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అంతర్జాతీయ సమాజం మద్దతు కోసం విజ్ఞప్తి చేశారు. చైనా చర్యలపై తగిన విధంగా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే ఇదే సమయంలో ప్రజాస్వామిక తైవాన్కు మద్దతు పలకాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నట్టు యింగ్ వెన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
తైవాన్ రక్షణ శాఖ రిసెర్చ్ డెవలప్మెంట్ విభాగం డిప్యూటీ హెడ్ ఓయ్ యాంగ్ లిసింగ్ ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన తైవాన్లో క్షిపణుల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే ఆయన మృతికి కారణాలపై తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఆయన గుండెపోటుతోనే మరణించారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. చైనా, తైవాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.