కాటారం, జూలై 22: పట్టా పాస్బుక్ కోసం దివ్యాంగుడి వద్ద రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తాసిల్దార్ మేడిపల్లి సునీత ఏసీబీకి చిక్కారు. కాటారం మండలం సుందర్రాజ్పేటకు చెందిన దివ్యాంగుడు ఐత హరికృష్ణ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. అతనికి కొత్తపల్లి శివారులో సర్వేనంబర్ 3లో 4.25 ఎకరాల భూమి ఉన్నది. భూమిని ధరణి పోర్టల్లో ఎక్కించి, కొత్త పాస్బుక్ ఇవ్వాలని కోరుతూ హరికృష్ణ కొన్ని రోజులుగా తాసిల్దార్ను కోరుతున్నారు. పాస్బుక్ ఇవ్వాలంటే రూ.5 లక్షలు లంచం కావాలని డిమాండ్ చేయగా.. రూ.3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలుత రూ.50 వేలు ఇచ్చారు. డబ్బుల్లేక విసిగిపోయిన హరికృష్ణ ఈ నెల 12న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం తాసిల్దార్ సునీతకు రూ.2 లక్షలు ఇస్తుండగా.. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తన సిబ్బందితో కలిసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.