కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 29 : కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే శ్రీరామరక్షయని కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్లో, బాలాజీనగర్ డివిజన్లోని సేవాలాల్నగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్వయంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాలను పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరిస్తూ భౌతికదూరాన్ని పాటించాలన్నారు. అత్యవసరమైతేనే ఇంటినుంచి బయటికి రావాలని కోరారు. పౌష్టికాహారం తీసుకుని మనోధైర్యంతో జీవించాలని కోరారు. కరోనాను నియంత్రించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా కరోనా పరీక్షలు చేయడంతో పాటు కరోనా వ్యాక్సిన్ కూడావేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ భవనాలు, ఫంక్షన్హాళ్లలో ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ పగడాల బాబూరావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.