న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో మొదటిసారిగా కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ కేసు నమోదయ్యింది. ఈ వైరస్ సోకిన 33 ఏండ్ల వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలోని ఎల్ఎన్జీపీ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడిని వారం రోజుల క్రితమే దవాఖానకు తీసుకువచ్చారని, ప్రత్యేకంగా ఒక గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తున్నది. వారం తర్వాత అతనికి కరోనా వైరస్ దక్షిణాఫ్రికా వేరియంట్ సోకినట్లు గుర్తించారు. అయితే బాధితుడిలో తొలుత కరోనా లక్షణాలేవీ కనిపించలేదని తెలిసింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి గురించిన వివరాలు తెలియాల్సివుంది.
గతంలో కూడా యూకే రకం కరోనా పాజిటివ్ వచ్చినవారిని ఇదే దవాఖానలో చికిత్స అందించారు. దేశంలో దక్షిణాఫ్రికా రకం కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా గత నెలలో ప్రకటించింది. నలుగురు వ్యక్తులకు ఈ వేరియంట్ కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపింది. అదేవిధంగా మరో వ్యక్తికి బ్రెజిల్ వేరియంట్ పాజిటివ్ వచ్చినట్లు పేర్కొంది.