న్యూఢిల్లీ, మార్చి 16: ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణపై ఆందోళన చెందుతున్న ఉద్యోగులకు అభయమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నించారు. ప్రభుత్వ బ్యాంకులన్నింటినీ ప్రైవేటీకరించడం లేదని, ప్రైవేటీకరించే బ్యాంకుల్లోని ఉద్యోగులందరి ప్రయోజనాలను పూర్తి స్థాయిలో కాపాడతామని ఆమె మంగళవారం భరోసా ఇచ్చారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తొమ్మిది ప్రధాన యూనియన్లు రెండు రోజుల సమ్మెకు దిగిన నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చారు. ‘పబ్లిక్ ఎంటర్ప్రైజ్ పాలసీని మేము ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించాం. ప్రభుత్వ సంస్థలు కొనసాగే నాలుగు కీలక రంగాలను గుర్తించాం. వీటిలో ఆర్థిక రంగాన్ని కూడా చేర్చాం. కనుక అన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్నట్లు భావించడం సరికాదు’ అని ఆమె చెప్పారు.
డీఎఫ్ఐ ఏర్పాటుకు క్యాబినెట్ ఓక
మౌలిక వసతుల అభివృద్ధి కోసం అధిక మొత్తంలో నిధులను వెచ్చించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకు అవసరమయ్యే పెట్టుబడులను సమకూర్చేందుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ (డీఎఫ్ఐ)ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదించింది. దీంతో ఇటీవల సార్వత్రిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన కార్యరూపం దాలుస్తుంది. రూ.20 వేల కోట్ల ప్రారంభ పెట్టుబడితో డీఎఫ్ఐని ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్ విలేకర్లకు వెల్లడించారు. దీంతో దీర్ఘకాలంలో నిధులను సమీకరించేందుకు ప్రత్యేకంగా ఓ సంస్థతోపాటు సంస్థాగత విధానాలు ఉంటాయన్నారు. డీఎఫ్ఐకి కొన్ని సెక్యూరిటీలను జారీ చేసేందుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. తొలి విడతలో డీఎఫ్ఐకి రూ.5 వేల కోట్లు సమకూరుస్తామని, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా కేటాయిస్తామని చెప్పారు. డీఎఫ్ఐలో 50 శాతం మంది నాన్-అఫీషియల్ డైరెక్టర్లు ఉంటారని తెలిపారు. నూటికి నూరు శాతం ప్రభుత్వ యాజమాన్యంతో డీఎఫ్ఐ ప్రారంభమవుతుందని, క్రమేణా దీనిలో ప్రభుత్వ వాటాను 26 శాతానికి తగ్గిస్తామని స్పష్టం చేశారు.