సిద్దిపేట జోన్, ఏప్రిల్ 10: సిద్దిపేటలోని పాత ఎంసీహెచ్ దవాఖానలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రత్యేక చొరవతో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణతోపాటు ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అన్ని హంగులతో ప్రప్రథమంగా స్వచ్ఛ బడిని ఏర్పాటు చేశారు. బడి నిర్మాణంలో వ్యర్థాలతో రూపొందించిన ఇటుక, టైల్స్ను ఉపయోగించారు. పాత బొంగులు, సైకిల్ రీమ్లతో స్వచ్ఛ పాఠశాల ప్రహరీ నిర్మించా రు. దీన్ని బెంగళూరు తర్వాత సిద్దిపేటలో ఏర్పాటు చేయగా ఆదివారం మంత్రి హరీశ్రావు ప్రారంభించనున్నారు. ఈ పాఠశాలలో చెత్త సేకరణ, చెత్తను తడి, పొడి, హానికరమైన చెత్తగా వేరు చేయడం, చెత్తతో సంపదను సృష్టించడం, చెత్తతో ఇండ్లలోనే ఎరువుల తయారీపై అవగాహన కల్పించడం, వ్యర్థ సామగ్రితో వివిధ కళాకృత్తులకు రూపకల్పన, సేంద్రియ ఎరువులతో పూల మొక్కలు, కూరగాయలను సాగుచేయడం వంటి అంశాలపై అన్ని వర్గాలకు డిజిటల్ క్లాసుల సహాయంతో పాఠాలు బోధిస్తారు. ఆ తర్వాత ప్రయోగాత్మకంగా వివరిస్తారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు, వ్యాపార వేత్తలు మొత్తంగా 50 మంది ఒకేసారి తరగతులు వినేలా ఏర్పాటు చేశారు. ఈ బడిని బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతితోపాటు మున్సిపల్ ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు.