ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట జోన్, ఏప్రిల్ 11: ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు దక్షిణ భారత దేశంలో మొట్టమొదటగా స్వచ్ఛ బడిని సిద్దిపేటలో ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సరైన పద్ధతిలో చెత్తను డీకంపోస్ట్ చేయకపోతే భవిష్యత్తు తరాలకు జరిగే నష్టాలను ఈ స్వచ్ఛ బడిలో బోధిస్తారని తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని పాత ఎంసీహెచ్ దవాఖాన ఆవరణలో నిర్మించిన స్వచ్ఛబడిని ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. చెత్త నిర్వహణపై స్వచ్ఛ పాఠాలు చెబుతూ సిద్దిపేట నేడు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందన్నారు. చెత్త వల్ల ప్రపంచం మొత్తం విలవిల్లాడుతుందని, భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే చెత్తను డీకంపోస్ట్ చేయాలని చెప్పారు. చెత్తను ఆదాయ వనరుగా ఏ విధంగా మార్చుకోవాలనే విషయంపై ఈ బడిలో పాఠాలు నేర్పిస్తామని మంత్రి తెలిపారు.