సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ) : జలుబు, దగ్గు, జ్వరం రాగానే….సొంతవైద్యంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్యులను సంప్రదించకుండానే మందులు వాడి ఇబ్బందులు పడుతున్నారు. లక్షణాలు కనిపించగానే.. కరోనా టెస్టు చేయించుకోకుండానే మందులు వాడుతూ పరిస్థితి చేయి దాటిన తర్వాత వైద్యశాలలకు పరుగులు తీస్తున్నారు. ఇలాంటి వారే ఎక్కువగా ప్రాణాలను కోల్పోతున్నారని రవి హీలియోస్ వైద్యశాల ఎండీ డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కొవిడ్ లక్షణాలు కనిపించగానే చాలామంది స్టెరాయిడ్స్, యాంటీ వైరల్ డ్రగ్స్ లాంటివి వాడుతున్నారు. తద్వారా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఇబ్బందుల్లో పడుతున్నారు. కరోనా వచ్చిన ప్రతి ఒక్కరికీ రెమ్డిసివిర్ తప్పని సరి కాదు. వైరస్ సోకిన మూడు రోజుల వరకు దీన్ని వాడాల్సి ఉంటుంది. అది కూడా ఆర్టీపీసీఎస్ రిపోర్టు ఆధారంగా వినియోగించాలి.
చాలా మంది కరోనా సోకుతుందని భావించి ముందస్తుగా టోసిలీ జుమాబ్, రెమ్డిసివిర్, హిపారిన్ ఇంజక్షన్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కొనుగోలు చేస్తున్నారు. కొవిడ్ సోకిన వారు లక్షణాలను బట్టి ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. అతిగా ఆవిరి పట్టడం, పుల్లింగ్ చేయడం , వంట వస్తువుల మిశ్రమంతో కషాయాలు సేవించడం కూడా మంచిది కాదు.