సిద్దిపేట, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బడి అనగానే విద్యార్థులు ఉంటారు అనుకుంటాం.. అక్కడ పాఠ్యాంశాలు బోధిస్తారనుకుంటాం.. కానీ, సిద్దిపేట స్వచ్ఛబడిలో మాత్రం చెత్త పునర్వినియోగం, చెత్త నుంచి సంపదను ఎలా సృష్టించవచ్చో చెప్తున్నారు. దేశంలోనే తొలిసారిగా కర్ణాటక రాజదాని బెంగళూరులో ఏర్పాటుచేసిన ‘స్వచ్ఛ గ్రహ’ స్ఫూర్తితో మంత్రి హరీశ్రావు చొరవతో సిద్దిపేటలో ప్రారంభమైన ఈ బడి ద్వారా ప్రజలకు స్వచ్ఛపాఠాలు బోధిస్తున్నారు. స్థానిక మాతాశిశు పాత దవాఖాన ఆవరణలో కోటి రూపాయలతో 2 వేల చదరపు గజాల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటుచేశారు. గత ఏప్రిల్ 10న మంత్రి హరీశ్రావు దీన్ని ప్రారంభించారు. ఈ స్వచ్ఛబడి రాష్ర్టానికే రోల్ మోడల్గా నిలుస్తున్నది. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడ పరిశీలిస్తున్నారు. డిజిటల్ గది ద్వారా వారికి చెత్త పునర్వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఔత్సాహికులు షార్ట్ఫిల్మ్లు రూపొందిస్తున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల ప్రజలు దీనిని సందర్శించేందుకు ప్రత్యేక వాహనం ఏర్పాటుచేయగా, ఇప్పటివరకు 5 వేల మందికిపైగా చూసినట్టు సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి తెలిపారు.
ప్రజలకు స్వచ్ఛపాఠం
సిద్దపేట మున్సిపాలిటీలోని 43 వార్డులు, 45 వేలకు పై గా జనావాసాల నుంచి నిత్యం 54.45 టన్నుల చెత్త వస్తున్నది. ఇందులో తడి చెత్త 26.80 టన్నులు, పొడిచెత్త 16.50 టన్నులు. సిల్ట్ 6.85 టన్నులు, బయో మెడికల్ వేస్ట్ 1.40 టన్నులు, హానికర చెత్త 1.20 టన్నులు, ఇతర వ్యర్థా లు 1.20 టన్నులు ఉంటున్నది. నిత్యం ఇలా సేకరిస్తున్న చెత్తను పునర్వినియోగం చేసుకోవడం, అందులోంచి సంపదను ఎలా సృష్టించవచ్చో స్వచ్ఛబడిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛ బడిలో వర్మికంపోస్టు యార్డు, పార్కు, డిజిటల్ తరగతి, వార్డు కంపోస్టు, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ విభాగాలను ఏర్పాటుచేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట సాగుచేస్తున్నారు. పనికి రాని వస్తువులతో చక్కని పరికరాలను తయారు చేశారు. ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ.. ఇలా ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయి. ప్లాస్టిక్తో కలిగే అనర్థాలను తెలిపే బొమ్మలు వేశారు. అక్కడే ఒక గోశాలను ఏర్పాటు చేశారు. ఆవుల నుంచి వచ్చిన పేడతోపాటు చెత్త ద్వారా సేంద్రియ ఎరువులను తయారుచేసి పెరటి తోటలకు, మిద్దె తోటలకు ఇవ్వనున్నారు. రైతులకు వ్యవసాయానికి కూడా ఈ ఎరువులను అందించనున్నారు. సేంద్రియ ఎరువు, కెమికల్ ఎరువుల ద్వారా పండిన కూరగాయలు ఎలా ఉన్నాయో ఇక్కడికి వస్తున్న ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛబడి కోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందించారు. ఈ స్వచ్ఛబడి ఇప్పుడు గూగుల్, ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ తదితర వాటిలో వస్తున్నది.