నల్లగొండ, మే 30 : కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూన్ నెలకు ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా లబ్ధిదారులకు ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేయాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తీవ్రంగా ఉన్నందున ప్రజలు బయటికి వెళ్లి పని చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పేదలు పస్తులు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉచితంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి లబ్ధిదారుడికీ 15 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఆదివారం జారీ అయ్యాయి. ప్రతి నెలా ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన లబ్ధిదారులకు ఒక్క రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా.. ప్రస్తుతం పదిహేను కిలోలు ఉచితంగా ఇవ్వనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 13.96 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
తొలి దశలో ఆరు నెలల పాటు ఉచితంగా…
కరోనా తొలి దశలో గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఆరు నెలల పాటు రేషన్ కార్డుదారులకు ఉచితంగా బియ్యం అందజేశారు. మే నెల నుంచి జూలై వరకు 12 కిలోల చొప్పున ఇవ్వగా.. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు పది కిలోలు అందజేశారు. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్డుదారుడికి నెలకు రూ.1200 చొప్పున మే నుంచి జూలై వరకు బ్యాంకు ద్వారా నగదు అందజేసింది. ఆ తర్వాత వైరస్ తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు సాధారణ స్థితికి చేరాయి. తాజాగా కరోనా రెండో దశ వేగంగా విస్తరిస్తుండడంతో ఈ జూన్ నెలకు ఉచితంగా బియ్యం అందజేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు, రాష్ట్రం పది కిలోలు.. మొత్తం 15కిలోలు ఇవ్వనున్నాయి.
నల్లగొండ జిల్లాలో13.92 లక్షల మందికి ప్రయోజనం
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 991 రేషన్ దుకాణాలు ఉండగా.. వాటి పరిధిలో 4,26,807 రేషన్ కార్డులు ఉన్నాయి. వాటిల్లో 13,12,722 లబ్ధిదారులు ఉన్నారు. మరో 30,051 అంత్యోదయ కార్డులు, 67 అన్నపూర్ణ కార్డులు కలిపి మొత్తంగా 4,56,925 కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల కింద మొత్తం 13,92,608 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అంత్యోదయ కార్డుదారులకు ప్రతి నెలా 35 కిలోలు, అన్నపూర్ణ కార్డు దారులకు పది కేజీలు ఇస్తుండగా.. ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన వారికి ప్రతి నెలా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందిస్తున్నారు. మొత్తంగా 7294.378 మెట్రిక్ టన్నుల బియ్యం కిలో రూపాయి చొప్పున ఇస్తున్నారు. అయితే.. కొవిడ్ నేపథ్యంలో ఉచితంగా ప్రతి యూనిట్కు పదిహేను కిలోల చొప్పున నెలకు మొత్తం 18,235.258 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వనున్నారు. అంత్యోదయ కార్డుదారులకు గతంలో ఇచ్చే 35 కిలోలతో పాటు పది కేజీలు అదనంగా ఇవ్వనున్నారు. అలాగే అన్నపూర్ణ కార్డుదారులకు గతంలో ఇచ్చే పది కిలోలతోపాటు మరో పది కేజీలు ఉచితంగా ఇవ్వనున్నారు. జూలై నెల కూడా ఇంతే మొత్తంలో ఉచిత బియ్యం ఇచ్చే అవకాశం ఉంది.