హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): బాలీవుడ్ నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో సిద్ధార్థ్ పితానిని హైదరాబాద్లో రెండురోజుల కిందట ముంబై నార్కోటిక్స్ క్రైంబ్యూరో అధికారులు అరెస్టు చేశారు. కుషాయిగూడలో ఉంటున్న అతడిని కోర్టులో హాజరుపర్చి ట్రాన్సిట్ వారెంట్ మీద ముంబైకి తరలించారు. శుక్రవారం అక్కడి సీఎంఎం కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు జూన్ ఒకటి వరకు రిమాండ్ విధించింది. కుషాయిగూడలో ఉంటున్న సిద్ధార్థ్ పితాని ఇంటికి ముంబై, హైదరాబాద్ నార్కోటిక్ బ్యూరో అధికారులు ఈ నెల 26న వచ్చి దాదాపు 7 గంటలపాటు సోదాలు జరిపారు. ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని మరుసటిరోజు హైదరాబాద్ కోర్టులో హాజరుపర్చి ముంబైకి తరలించారు. సుశాంత్సింగ్ డ్రీమ్ 150 ప్రాజెక్టుకు క్రియేటివ్ మేనేజర్గా సిద్ధార్థ్ వ్యవహరించారు. సుశాంత్తో కలిసి అతని ఫ్లాట్లోనే ఉండేవాడు. గత ఏడాది జూన్ 14 ఫ్లాట్లో ఉరేసుకోగా చూసిన తొలివ్యక్తి సిద్ధార్థ్. సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడనే విషయంలోనే, ఆత్మహత్య కేసులో సిద్ధార్థ్ అనుమానితుడిగా ఉన్నాడు. దీనికి సంబంధించి ముంబై ఎన్సీబీ అధికారులు 67 ఎన్డీపీఎస్ కింద నోటీసులు జారీచేసినా ఇతడు హాజరుకాలేదు. దర్యాప్తుకు సహకరించలేదు. దీంతో పలు ప్రాంతాల్లో సిద్ధార్థ్ గురించి గాలించారు. చివరికి అధికారులు అతడిని హైదరాబాద్లో గుర్తించి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 35 అనుమానితులు ఉండగా.. 34 మందిని అధికారులు అరెస్టుచేసినట్టు సమాచారం. తాజాగా సిద్ధార్థ్ అరెస్టుతో ఆ సంఖ్య 35 చేరుకుంది. సిద్ధార్థ్ వివాహం జూన్లో జరుగనున్నట్టు తెలిసింది.