సూర్యాపేట, జూన్ 10: కాలం చెల్లిన, ప్రాసెసింగ్ చేయని విత్తనాలను ప్యాకెట్లలో నింపి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను సూర్యాపేట జిల్లా పోలీసులు పట్టుకున్నారు. రూ.13.51 కోట్ల విలువైన వివిధరకాల 986.74 కిలోల విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్టుచేసి రిమాండ్కు తరలించారు. కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ గురువారం సూర్యాపేటలో కేసు వివరాలను వెల్లడించారు. ఇటీవల పట్టుబడ్డ నకిలీ విత్తన వ్యాపారి మాడా జగన్మోహన్ రావు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ వనస్థలిపురంలోని గోదాము, కార్యాలయంపై దాడిచేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మాలపాటి వెంకట కృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడుకు చెందిన వాసిరెడ్డి ప్రతాప్కుమార్, ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నారాయణపురంనకు చెందిన వేమిరెడ్డి లక్ష్మీరెడ్డి, సిద్దిపేటజిల్లా తొగుట మండలం గుడికందులకు చెందిన సూకురి యాదగిరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన రమణ పరారీలో ఉన్నాడు.