భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండల పరిధిలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఆ జలాశయం నిండు కుండలా తొణికిసలాడుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.14 మీటర్ల మేర నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు గేట్లు ఎత్తివేసి.. 2,695 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పాల్వంచ పరిధిలోని కిన్నెరసాని రిజర్వాయర్కు కూడా వరద కొనసాగుతోంది. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 407 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 400 ఫీట్లకు చేరింది. ప్రాజెక్టులకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.