మహబూబ్నగర్ జూన్ 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ ప్రాంత ఆర్డీఎస్ రైతులకు అన్యాయం చేస్తూ కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్ట (రాజోళి బండ డైవర్షన్ స్కీం) కుడి వైపున ఏపీ సర్కారు రూ.1985.423 కోట్లతో కాల్వ నిర్మాణ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా స్ట్రక్చర్, కెనాల్ పనులు ముమ్మరం చేసింది. ఈ ఏడాది రైతులకు ఆర్డీఎస్ కుడి కాల్వ ద్వారా సాగు నీరు అందించేందుకు ఏపీ సర్కార్ పనులు చేస్తున్నది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అంటూ వితండవాదం చేస్తూ 4 టీఎంసీల నీటిని 160 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా 40 వేల ఎకరాల ఆయకట్టుకు తరలించడంతోపాటు 4 లిఫ్టులు ఏర్పాటు చేసి అదనంగా మరో 5 లక్ష ఎకరాలకు అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తున్నది. సీడబ్ల్యూసీ, అపెక్స్ కమిటీ, కర్ణాటక, తెలంగాణ, కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా కాల్వ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. ఈ కెనాల్ నిర్మాణంతో తెలంగాణలోని 87,500 ఎకరాల ఆయకట్టు ఉనికి ప్రమాదకరంగా మారనున్నది. మరోవైపు 100 గ్రామాలు తాగు నీటికి ఇబ్బందులు ఏర్పడనున్నాయి. నది పరీవాహక ఆయకట్టు 4 లక్షల ఎకరాలు బీడుగా మారే అవకాశం ఉన్నదని తెలంగాణ రైతాంగం ఆందోళన చెందుతున్నది.