తాను అమ్మవుతూనే.. ఎంతో మంది రోగులకు ఒక తల్లిలా సేవలందిస్తోంది. ఎనిమిది నెలల గర్భాన్ని మోస్తూనే.. విపత్కర కాలంలోనూ విధుల నుంచి వైదొలగకుండా సేవలే పరమావధిగా భావిస్తోంది ఈ డాక్టరమ్మ. ఈ కరోనా కాలాన్ని సైతం సొమ్ము చేసుకునే ఎంతోమంది వైద్యులను చూస్తున్నాం. కాని, తోటి వారిని ఇలాంటి ఆపద కాలంలో ఆదుకోవాలన్న తన తపన ఎంతో మందిని చేతులు జోడించేలా చేస్తుంది. డాక్టర్ సరిత ప్రభుత్వ వైద్యురాలు. మౌలాలి యూపీహెచ్సీలో పని చేస్తూ రోగులను ఒక తల్లిలా ఆదుకుంటోంది..
“కష్టాలు ప్రాణానికే కాదు.. బంధాలకు ఓ పరీక్షే. నీ వాళ్లెవరో..? కాని, వాళ్లెవరో తెలిసేలా చేస్తుంది ఈ కరోనా ‘కష్ట’కాలం. ఎంత కష్టమొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకునేది మాత్రం అమ్మే. అందుకే అమ్మను మించిన దైవం లేదంటారు పెద్దలు. కడుపులో ప్రాణం పోసుకుంటున్న బిడ్డను మోస్తూనే ప్రాణం నిలుపుకోవడం కోసం పోరాటం చేస్తున్న ఏ తల్లీ బిడ్డలకో తన బిడ్డల్లాగ సేవ చేస్తోంది ఓ ప్రభుత్వ డాక్టరమ్మ. నిండు చూలాలి (గర్భిణి) అయినప్పటికీ ఇప్పుడు మెటర్నటీ సెలవులొద్దంటూ.. కరోనా పీడితులకు వైద్యసేవలు అందిస్త్తున్నది. ఆ డాక్టరమ్మ పేరు సరిత. ఆమె మౌలాలి ప్రభుత్వ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్సీ)లో విధులు నిర్వహిస్తోంది. ఆమెకు ఇంట్లో ఓ నాలుగేండ్ల బాబు ఉన్నాడు.
ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి. కరోనా కరాళనృత్యం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో బాలింతలు, గర్భిణిలు, చిన్నారులు, వృద్ధులు ఇంటి గడప దాటే పరిస్థితి లేదు. కాని, ఆమె మాత్రం మానవత్వం మూర్తీభవించిన ఒక ప్రభుత్వ డాక్టర్. కరోనాతో దేశంలో మనుషులు పిట్టల్లాగ రాలిపోతుంటే.. “నేను మెటర్నటీ సెలవులు తీసుకుని నన్ను నేను కాపాడాకోవాల్నా.. లేక చదివిన చదువుకు న్యాయం చేయాల్నా” అనే సందిగ్ధాన్ని వీడి కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వారియర్ డా.సరిత కదిలింది. అలాగే, దవాఖానకు వచ్చే 45 ఏండ్లలోపు వ్యక్తులకు కొవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేస్తుంది.
‘నిండు గర్భిణిగా ఉన్న మీరు సెలవు తీసుకోవచ్చుగా..’ అని ఎవ్వరైనా అడిగితే.. “ప్రస్తుతం ఈ దేశంలో వైద్యుల అవసరం ఉంది.
ఇప్పటికే చాలా మంది డాక్టర్లు కొవిడ్ బారినపడి చనిపోయారు.
కొందరు రిటైర్డ్ అయ్యారు. మరి కొందరు సెలవులు తీసుకోకుండా ప్రజలను కాపాడేందుకు కష్టపడుతున్నారు.
నేను అంతే.. మెటర్నటి సెలవులను డెలివరీ తరువాత తీసుకుంటాను.. జూన్ తరువాత కొవిడ్ ప్రభావం తగ్గుతుంది అంటున్నారుగా.. ఆ తరువాత సెలవుల గురించి ఆలోచిస్తాను.
కాని, ప్రస్తుతం ఒక్క డాక్టర్ తక్కువైనా వందల సంఖ్యలో కొవిడ్ బాధితులకు ఇబ్బందులు తప్పవు.
అందకే ఇప్పుడు నాకు సెలవులొద్దు. జాగ్రత్తలు పాటిస్తూనే జూన్ వరకు దవాఖానలో డ్యూటీ చేస్తాను” అంటూ సమాధానం చెప్తుంది డాక్టర్ సరిత.
‘వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే చాలా మంది మహిళలు ఐదు నుంచి ఆరు నెలల గర్భిణీగా ఉన్న సమయంలోనే మెటర్నటీ సెలవులకు వెళ్తారు. దేశంలో కరోనా ఉధృతిని చూసైనా ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి. లేదంటే తీవ్ర పరిణాలు తప్పవు. తప్పనిసరిగా మాస్కు ధరించాలి. తప్పని పరిస్థితుల్లో మాత్రమే కుటుంబంలో ఒక్కరు మాత్రమే బయటకు రావాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, వైద్యుల సూచనలను పాటించాలని, అర్హతలు ఉన్న వాళ్లందరు వ్యాక్సిన్ను తీసుకోవాలని, ప్రజలందరు కొవిడ్-19 నిబంధనలు పాటిస్తేనే నాలాంటి డాక్టర్లకు కూడా విశ్రాంతి లభిస్తుంది’ అని ఆమె కోరుతున్నారు. ఈ డాక్టరమ్మకు కొవిడ్ రోగులే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులు, మౌలాలి ప్రభుత్వ దవాఖానకు వచ్చే సాధారణ రోగులు కూడా చేతులెత్తి మొక్కుతున్నారు.