కరీంనగర్ : రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు, ఏటా 10 శాతం మరణాల తగ్గింపు లక్ష్యంతో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన రోడ్డు భద్రతా కమిటీ సభ్యులు ఈ రోజు కరీంనగర్ రవాణా శాఖ కార్యాలయాన్ని సందర్శించారు. కేంద్ర ప్రభుత్వ రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లో ఢిల్లీ ఇంట్రిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ సిస్టం(DIMTS), ట్రాన్స్పోర్టు రీసెర్చ్ ఇంజ్యూరి ప్రివెన్షన్ ప్రోగ్రాం,(TRIPP), IIT ఢిల్లీ భాగస్వామ్యంతో ఈ కమిటీ ఏర్పాటు అయింది. దేశ వ్యాప్తంగా రహదారి ప్రమాదాల తీరుతెన్నులను విశ్లేషిస్తున్న ఈ కమిటీ ప్రమాదాల నివారణకు ప్రభుత్వ విభాగాలు తీసుకుంటున్న చర్యలు, సమన్వయంపై అధ్యయనం చేసి నివేదిక రూపొందిస్తుంది.
క్షేత్రస్థాయి సర్వేలో భాగంగా కమిటీ సభ్యులు నలిన్ బింద్లేష్, విష్ణు అబ్బగాని, శుభం గౌర్ ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవాణా కార్యాలయంలో లైసెన్స్ల జారీ విధానం, వాహనాలకు ఫిట్నెస్ల జారీ విధానంతో పాటు ప్రమాదాల నివారణకు రవాణ శాఖ తీసుకుంటున్న చర్యల గురించి డీటీసీ చంద్ర శేఖర్ గౌడ్ వారికి వివరించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రహదారి భద్రతా అవగాహన కార్యక్రమాలు, వాహన తనిఖీలు, విధిస్తున్న జరిమానాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ నాగలక్ద్మి, ఏఎంవీఐ రజనీ దేవి పాల్గొన్నారు.