హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని హుస్సేన్సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ)తో తయారుచేసిన గణనాథుడి విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ట్యాంకుబండ్పై నుంచి విగ్రహాల నిమజ్జనానికి కూడా సమ్మతించింది. పీవోపీ విగ్రహాలను హుస్సేన్సాగర్లో నిమజ్జనం చేయరాదన్న హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ధర్మాసనం గురువారం విచారించింది. ఈ ఏడాది వరకు హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి సమ్మతించింది. వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర హైకోర్టు ఆదేశాలే అమలవుతాయని స్పష్టంచేసింది. హైకోర్టు తీర్పును నిలిపేసింది.
ట్యాంకుబండ్పై నుంచి హుస్సేన్సాగర్లో పీవోపీ గణేశ్ విగ్రహాలు నిమజ్జనం చేయరాదని వినాయకచవితికి ఒక్కరోజు ముందు హైకోర్టు తీర్పు ఇవ్వటంతో గందరగోళం ఏర్పడిందని రాష్ట్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రభుత్వ న్యాయవాది వెంకట్ పల్వాయి తెలిపారు. కోర్టు తీర్పు రావటానికంటే ముందే నగరంలో మూడు నాలుగు లక్షల విగ్రహాల ఏర్పాట్లు జరిగాయని, వీటిలో వివిధ సైజుల్లో పీవోపీ విగ్రహాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పీవోపీ విగ్రహాల్ని హుస్సేన్సాగర్, ఇతర నీటి వనరుల్లో నిమజ్జనం చేయరాదన్న హైకోర్టు తీర్పు ఆచరణ కష్టమని పేర్కొన్నారు. ‘హైకోర్టు ఉత్తర్వులను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకున్నది. భారీ విగ్రహాలను ట్యాంకుబండ్పై నుంచి కాకుండా సచివాలయం, సంజీవయ్య పారు వంటి మార్గాల ద్వారా తరలించి నిమజ్జనం చేయటం కష్టం. నిమజ్జనం చేసిన 24 గంటల్లో వ్యర్థాలను తొలగిస్తాం. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ 25 చిన్న కుంటలను సిద్ధంచేసింది. వీటిలో పెద్ద విగ్రహాల నిమజ్జనం సాధ్యం కాదు. ఆ కుంటల వద్దకు భారీ విగ్రహాల తరలింపు ట్రాఫిక్ పరంగా వీలుకాదు. ఈ సమస్యలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తీర్పును సమీక్షించాలని హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినా ఫలితం లేకపోయింది. అందుకే ఎస్ఎల్పీ దాఖలు చేయాల్సివచ్చింది’ అని ప్రభుత్వం విన్నవించింది. ప్రభుత్వ వాదనను ప్రతివాది న్యాయవాది మామిడి వేణుమాధవ్ వ్యతిరేకించినప్పటికీ ధర్మాసనం ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెల్లడించింది.
హుస్సేన్సాగర్ను రక్షించుకోవటం మనందరి బాధ్యత అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ అన్నారు. ‘హైదరాబాద్ నాకు చాలా బాగా తెలుసు. అకడే న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాను. కేసులు వాదించాను. హుస్సేన్సాగర్ ఎంతో అందంగా ఉంటుంది. ఒకప్పుడు అది తాగునీటి కోసం ఉపయోగపడేది. క్రమేణా కలుషితమైంది. ఇప్పుడు మరింత కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ ఏడాదికి మాత్రమే హుస్సేన్సాగర్లో నిమజ్జనానికి అనుమతి ఇస్తున్నాం. ట్యాంకుబండ్ సుందరీకరణ పనులను ఏటా చేయా ల్సి వస్తున్నది. ఇకపై ఈ పనులకు నష్టం వాటిల్లకూడదు’ అని సూచించారు. నిమజ్జనం అనంతరం విగ్రహాలు, వ్యర్థాలను తొలగిస్తామన్న హామీతో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత ఇంకేమైనా అంశాలు ఉంటే హైకోర్టులోనే పరిషరించుకోవాలని సూచించారు.