నిజామాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ దేశాన్ని వణికిస్తూనే ఉంది. తాజాగా కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్(మ్యూకర్ మైకోసిస్) హడలెత్తిస్తున్నది. మొదట్లో గుజరాత్, ఢిల్లీ, మహారాష్ర్టాల్లో వెలుగు చూసిన కేసులు ప్రస్తుతం రాష్ట్రంలోనూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. వారం రోజులుగా బ్లాక్ ఫంగస్ కేసులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ వెలుగు చూస్తున్నాయి. కొంత మంది ఈ వ్యాధి బారిన పడి కోలుకుంటుండగా మరికొంత మంది ఇప్పటికే ప్రాణాలు వదిలారు. అవగాహన లేకపోవడం, సరైన సమయంలో సరైన చికిత్స అందకపోవడం వంటి కారణాలతో ఊపిరి వదిలారు. వాస్తవానికి బ్లాక్ ఫంగస్ వ్యాధికి భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. కరోనా బారిన పడిన వ్యక్తికి ముందుగానే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే బ్లాక్ ఫంగస్కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబు తున్నారు. మొదట్లోనే ఈ వ్యాధిని గుర్తిస్తే సులభంగా అరికట్టవచ్చని అంటున్నారు. బ్లాక్ ఫంగస్ అనే వ్యాధి మ్యూకో మైకోసిస్ అనే ఫంగస్ ద్వారా వ్యాపిస్తుంది. మ్యూకోర్ మైసిటీస్ అనేది శిలీంద్రం. ఇది నల్లగా ఉన్నందున బ్లాక్ ఫంగస్ అని పిలుస్తున్నారు. ఇది చాలా అరుదుగా వ్యాపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూస్తే వెంటనే వైద్య సహాయం కోసం ప్రయత్నించాలని సూచిస్తున్నారు. మంత్రి సూచనల మేరకు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసేందుకు వైద్యులు సిద్ధం అవుతున్నారు.
లక్షణాలు ఇవీ…
బ్లాక్ ఫంగస్ గాలిలో ఎగురుతూ ఉంటుంది. ముక్కు ద్వారా లోపలికి వెళ్తుంది. ఒక్కోసారి శరీరానికి గాయాలు, గాట్లు ఉంటే అక్కడ కూడా వ్యాపిస్తుంది. అలాగే శరీరం కాలిన ప్రదేశంలో కూడా ఇది వ్యాపిస్తుంది. అన్నింటి కంటే ముక్కు ద్వారా ఇది ఎక్కువగా వ్యాపించే అవకాశాలుంటాయి. అయితే ఇది శరీరంలోని ఏ భాగంపైనైనా దాడి చేయగలదు. కానీ ఇది సోకే అవకాశాలు చాలా తక్కువ. ఒక వేళ ఈ వ్యాధి సోకితే నిర్లక్ష్యం చేయొద్దు. లేదంటే ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని వైద్యులు అంటున్నారు. కంటి కింద నొప్పి, ముఖంలో ఒక పక్క వాపు, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ, పాక్షికంగా దృష్టి లోపం వంటివి బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రారంభంలో కనిపించే లక్షణాల్లో ముఖ్యమైనవి. ఈ ఇన్ఫెక్షన్ మరింత ముదిరితే కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి అంధత్వం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ మెదడుకు పాకితే మరింత ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రారంభ దశలోనే బ్లాక్ ఫంగస్ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారి తీస్తుందని సంబంధిత వైద్యులు పేర్కొంటున్నారు. ముక్కు చుట్టూ ఉండే గాలి గదులు, ఊపిరితిత్తులు, చర్మం, కండ్లు, మెదడు భాగాల్లోనూ బ్లాక్ ఫంగస్ వ్యాపిస్తుంది.
అప్రమత్తంగా ఉండాలి..
మన చుట్టూ ఉండే వాతావరణంలో ఈ ఫంగస్కు సంబంధించిన స్పోర్స్ ఉంటాయి. గాలిలో తిరుగుతున్న స్పోర్స్ పీల్చడం ద్వారా వస్తుంది. జబ్బున్న వారిని అంటుకోవడం, తాకడం వల్ల సోకదు. సైనసైటిస్ సమస్య ఉన్న వారికి కూడా బ్లాక్ ఫంగస్ ఏర్పడవచ్చు. బ్లాక్ ఫంగస్ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది. బ్లాక్ ఫంగస్ వల్ల కండ్లు ఎర్రబడతాయి. ముఖం వాపు, తిమ్మిర్లు ఏర్పడతాయి. తలనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ముక్కులో దురద, కండ్లపైనా లేదా కింద వాచినట్లు కనిపించినా, కంటి చూపు మందగించినా వైద్యులను సంప్రదించాలి. దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి ఈ ఫంగస్ ఏర్పడవచ్చు. కొవిడ్ బాధితులందరికీ ఈ ఫంగస్ ఏర్పడదు. అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. షుగర్ వ్యాధి అదుపు చేయలేనంత ఉన్న వారికి, అవయవ మార్పిడికి మందులు వాడుతున్న వారికి, హెచ్ఐవీ – ఎయిడ్స్ జబ్బులున్నవారు, క్యాన్సర్తో బాధపడుతున్న వారికి, కార్డికోస్టిరాయిడ్స్ మందులు వాడుతున్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.