హైదరాబాద్: హైదరాబాద్ నగరవారుసులకు మరింత ఆహ్లాదం అందనుంది. నిత్యం పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిటకిటలాడే చార్మినార్ నేడు ప్రశాంత వాతావరణంలో దర్శనమివ్వనుంది. ఈ పురాతన కట్టడాన్ని తనివితీరా చూస్తూ, ఇష్టం వచ్చిన వస్తువులను, ఆహార పదార్థాలను కొనుక్కునే అవకాశం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. గత కొన్ని రోజులుగా ప్రతి ఆదివారం ట్యాంక్బండ్పై సండే-ఫండే (Sunday Funday) కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు.
చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే-ఫన్డే కార్యక్రమం కొనసాగనుంది. సాయంత్రం 6:30 గంటలకు పోలీస్ బ్యాండ్ నిర్వహించనున్నారు. రాత్రి 8:30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఇక అర్ధరాత్రి వరకు లాడ్ బజార్ను తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను రూపొందించారు. భోజన ప్రియులకు నోరూరించే ఫుడ్ స్టాల్స్ను ఏర్పాటు చేశారు. సండే-ఫన్డేకు వచ్చే వాహనదారులకు నాలుగు ప్రదేశాల్లో పార్కింగ్ సౌకర్యం కల్పించారు.