“ఆమె పేరు శిరీష. ఐటీ ఉద్యోగి. వివాహం జరిగి నాలుగేండ్లయింది. ఇద్దరు సంతానం. వర్క్ ఫ్రం హోంతో ఇంట్లో పనులు రెట్టింపయ్యాయి. ఆమె భర్త కూడా ఐటీ ఉద్యోగి. అతడు తన తల్లిదండ్రులను కరోనా భయంతో సొంతూరికి పంపించాడు. దీంతో పిల్లలను చూసుకుంటూ.. ఇంటి పని నిర్వహిస్తూ.. అటు ఆఫీస్ పని చేయడం ఆమెకు తలకు మించిన భారంగా మారింది. ఆ ఒత్తిడి కారణంగా భర్తతో తరచూ ఘర్షణపడేది. ఇద్దరి మధ్య జరిగిన వాగ్వాదంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఈ బాధతో ఆమె భర్త మానసికంగా కుంగిపోయాడు. తల్లిదండ్రులు ఆమెకు సర్దిచెప్పడంతో తిరిగి ఇంటికొచ్చింది. అయితే ఇద్దరి మధ్య సఖ్యత కుదరడానికి చాలా రోజులు పట్టింది.”
సిటీబ్యూరో, జూన్ 5 ( నమస్తే తెలంగాణ ) : కరోనా పరిస్థితులు దంపతుల మధ్య ఘర్షణలకు కారణమవుతున్నాయి. కొవిడ్ ప్రభావంతో వర్క్ ఫ్రం హోం, వెంటాడుతున్న వైరస్ భయం, విరామం లేని పని, ఇంట్లోనే ఉండాల్సి రావడం తదితర కారణాలతో ఆలు మగలూ ఒత్తిడికి గురవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. చాలా మంది దంపతులు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఒకరికి ఒకరూ అండగా నిలబడితేనే జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందని వారికి అవగాహన కల్పిస్తున్నారు. చాలా వరకు నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న దంపతులు తమ పెద్దలను కొవిడ్ భయంతో సొంతూళ్లకు పంపించారు. దీంతో ఓవైపు ఇంటి బాధ్యత… మరోవైపు పిల్లలను చూసుకోవడం లాంటి పనులతో మహిళా ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నిర్ణీత సమయంలో ప్రాజెక్టులు పూర్తి చేయలేక బాస్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తున్నదని ఓ ఉద్యోగి వాపోయారు. భార్యాభర్తల మధ్య అర్థం చేసుకునే తత్వం లేకపోతే బంధాలు చీలిపోయే ప్రమాదం ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
ఆలూమగలన్నాక చిరాకులు, పరాకులు సహజం. చిన్నచిన్న వాటికే ఇదైపోతూ తేగేదాక లాగితే బంధం బలహీనపడుతుంది. అనుమానాలు తొంగిచూస్తాయి. అపార్థాలు ఎడం పెంచుతాయి. దంపతుల మధ్య అనురాగాలు శ్రుతిలో సాగాలంటే కచ్చితంగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. కొవిడ్ పరిస్థితులు ప్రత్యక్షంగా..పరోక్షంగా అందరిపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై ఎక్కువే. వారు ఇంటి పని, పిల్లల బాధ్యత చూసుకుంటూనే విధులు నిర్వర్తించడం