ఠాణాలోనే లంచం తీసుకుంటూ పట్టుబడ్డ చంద్రశేఖర్
తాండూరు/పెద్దేముల్, జూలై 13: ఠాణాలోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ఎస్సై చంద్రశేఖర్. పెద్దేముల్ మండలం మంబాపూర్కు చెందిన ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాస్ అనుచరుల ఇసుక ట్రాక్టర్ను ఎస్సై పట్టుకొని కేసు పెట్టకుండా ఉండాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం వారం రోజుల క్రితం రూ.20 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.30 వేలను మంగళవారం పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్సై ని పట్టుకున్నారు. డబ్బులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.
నెక్కొండలో వ్యవసాయాధికారి..
నెక్కొండ, జూలై 13: వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ మండల వ్యవసాయాధికారి అడిదెల సంపత్రెడ్డి ఫెర్టిలైజర్ షాపు నిర్వాహకుడి నుంచి లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అప్పల్రావుపేటలో వడ్డె ఏకాంబరం అనే వ్యక్తి ఓడీసీఎంఎస్ తరఫున ఫెర్టిలైజర్ షాపు నిర్వహిస్తున్నా రు. షాపులో తనిఖీలు నిర్వహించకుండా ఉండేందుకు రూ.15 వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.10 వేలు తీసుకునేందుకు ఏవో అంగీకరించాడు. మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏకాంబరం నుంచి ఏవో సంపత్రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఏవోను అరెస్ట్ చేశారు.