హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): 2019-20 హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో నాటిన మొక్కల్లో 90 శాతం చిగురించాయని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ తెలిపారు. రాష్టవ్యాప్తంగా మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నాటినవాటిల్లో బతికిన మొక్కల శాతంపై అటవీశాఖ ఆధ్వర్యంలో బుధవారం క్షేత్రస్థాయి అధ్యయనం ప్రారంభమైంది. అటవీసంరక్షణ ప్రధాన అధికారి ఆర్ శోభ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్తో చర్చించారు. లీనియర్ ప్లాంటేషన్లో 98 శాతం మనుగడ సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా నరేపల్లిలో భాగ్యనగర్ నందనవనం జింకలపార్కులో అభివృద్ధి చేసిన గడ్డిప్లాంట్లను తనిఖీ చేశారు.