ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 22: రాష్ట్రంలోని యూపీ, పీజీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఆడియో, వీడియోల రూపంలో అందించడంతోపాటు దిశానిర్దేశం చేయడంపై ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రీసెర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ) ప్రభుత్వ విభాగాలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు గురువారం ఈఎంఆర్సీ, ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్ర కాలేజియేట్ ఎడ్యుకేషన్, తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రుసా) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం జరిగింది. కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, రూసా ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్మిట్టల్, ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, ఈఎంఆర్సీ డైరెక్టర్ ప్రొఫెసర్ కే నరేందర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని యూజీ, పీజీ విద్యార్థులకు మూక్స్ (మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్) కోర్సులు అభ్యసించేందుకు ఎడ్యుకేషనల్ ఈ-కంటెంట్ను అందించనున్నారు. న్యూఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కన్సార్షియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ)తో కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ మధ్య మరో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం దేశంలోని మీడియా సెంటర్లు అభివృద్ధి చేసిన కంటెంట్ను రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీ యూజీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, సీఈసీ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్భూషణ్ నడ్డా, ఓయూ రూసా నోడల్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్, యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జీ మల్లేశం, రూసా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.