ఒకేరోజు 58 మంది అభ్యర్థులు..105 సెట్లు
మొత్తం 78 మంది అభ్యర్థులు…128 సెట్ల నామినేషన్లు
నల్లగొండ ప్రతినిధి, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మూడ్రోజుల వరుస సెలవుల అనంతరం ఆఖరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువగా దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం పెద్దఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో గతంలో ఎన్నడూ లేనన్ని నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 78మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రోహిత్సింగ్ వెల్లడించారు. చివరిరోజు టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్కుమార్ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో సాగర్ నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను సాగర్కు చెందిన వివిధ సామాజికవర్గాల నేతలతో కలిసి దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి స్థానిక నేతలతో కలిసి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.
బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవికుమార్ ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి నామినేషన్ వేశారు. సాయంత్రం ఆరు గంటల వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తూనే ఉన్నారు. మరోవైపు అంతంతమాత్రంగా ఉన్న బీజేపీ పరిస్థితి అభ్యర్థి ఎంపికతో మరింత దిగజారిపోయింది. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన అభ్యర్థికి టికెట్టు ఇవ్వడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి దంపతులు అలిగి దూరంగా ఉన్నారు. మరోనేత కడారి అంజయ్యయాదవ్ బీజేపీ నేతల తీరుతో విసిగిపోయి సీఎం కేసీఆర్ సమక్షంలో భారీ అనుచరగణంతో టీఆర్ఎస్లో చేరారు. భగత్ గెలుపు కోసం పని చేస్తామని అంజయ్యయాదవ్ ప్రకటించారు. మరోవైపు సాగర్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యులతో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ భేటీ అయ్యారు. భగత్ గెలుపును మనందరి గెలుపుగా భావించాలని పిలుపునిచ్చారు. నామినేషన్ కార్యక్రమం అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ మాడ్గులపల్లి మండలం అభంగాపురం నుంచి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సాగర్ ముఖ్యనేతలు వెంట రాగా భగత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పూసలపాడు, గాజలాపురం వరకు కొనసాగగా ఈ ఎన్నికల్లో జానారెడ్డికి ఓటేస్తే వృథా అవుతుందని, సాగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్కు ఓటు వేయాలని మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 71మంది నామినేషన్లు వేయగా.. ప్రస్తుతం అదే రీతిలో ఇక్కడా 78మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తొలి నాలుగు రోజుల్లో 20మంది 23 నామినేషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే గడువు మిగిలి ఉండగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు తరలివచ్చారు. వీరితోపాటు వారి పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు తరలిరావడంతో నిడమనూరులో కోలాహలం నెలకొంది. ఉదయం 11గంటలకు నామినేషన్ కార్యక్రమం మొదలుకాగా నోముల భగత్కుమార్ నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. అంతకుముందు తెల్లవారుజామున స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెంలోని తన తండ్రి నోముల నర్సింహయ్య సమాధి వద్ద పూలమాల ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి పాలెంలోని ప్రసిద్ధ ఆలయంలో, నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో పూజలు చేశారు.
తర్వాత హాలియాలోని స్వగృహం నుంచి తల్లి లక్ష్మితో కలిసి నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. నిడమనూరులోని పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడి నుంచి మంత్రులు జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్రావు, గాదరి కిశోర్కుమార్, బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, పైళ్ల శేఖర్రెడ్డి, జీవన్రెడ్డి, కోరుకంటి చందర్, శంకర్నాయక్, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, పూల రవీందర్, నేతలు ఎంసీ కోటిరెడ్డి, విజయేందర్రెడ్డి, రాంచందర్నాయక్ తదితరులతో కలిసి భగత్కుమార్ నామినేషన్ కార్యక్రమానికి తరలివెళ్లారు. ఆర్వో కార్యాలయంలోకి అభ్యర్థి వెంట ఇద్దరి మాత్రమే అనుమతి ఉండడంతో నాలుగు సెట్ల కోసం ఎనిమిది మంది నేతలు లోపలికి వెళ్లారు.
మంత్రి జగదీశ్రెడ్డి, ఎంసీ కోటిరెడ్డితో కలిసి ఒక సెట్, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, తిరుమలగిరి సాగర్ ఎంపీపీ భగవాన్నాయక్లతో కలిసి రెండో సెట్, ఎడవెల్లి విజయేందర్రెడ్డి, రాంచందర్నాయక్తో కలిసి మూడో సెట్, జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, నిడమనూర్ ఎంపీపీ బొల్లం జయమ్మతో కలిసి నాల్గో సెట్ను భగత్ ఆర్ఓకు అందించారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ భగత్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మంత్రి జగదీశ్రెడ్డి ప్రకటించగా, తన తండ్రిని ఆదరించినట్లుగానే నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించేందుకు తనను అక్కున చేర్చుకోవాలని ఓటర్లకు భగత్ విజ్ఞప్తి చేశారు.
జానారెడ్డి, రవినాయక్ నామినేషన్లు
కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డి మధ్యాహ్నం 12గంటలకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఆర్వో కార్యాలయంలోకి వెళ్లారు. ఆయన వెంట సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కర్నాటి లింగారెడ్డి, కొండేటి మల్లయ్య ఉన్నారు. జానారెడ్డి రెండు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ అభ్యర్థి డాక్టర్ రవినాయక్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే సంకినేని, పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డిలతో కలిసి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. టీడీపీ అభ్యర్థి మువ్వా అరుణ్కుమార్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ హాజరయ్యారు.
ముగిసిన నామినేషన్ల ఘట్టం
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. చివరి రోజైన మంగళవారం ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు తరలిరావడంతో అదనపు ఎస్పీ నర్మద పర్యవేక్షణలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 58మంది అభ్యర్థులు 105నామినేషన్ సెట్లు దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. అంతకు ముందు 20మంది అభ్యర్థులు 23నామినేషన్ సెట్లు సమర్పించగా మొత్తం 78మంది అభ్యర్థులు, 128నామినేషన్ సెట్లు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం మూడుగంటల వరకు ఆర్వో కార్యాలయం వద్దకు చేరుకున్న వారిని లోపలికి అనుమతించి టోకెన్లను జారీ చేశారు. నేడు నామినేషన్ల పరిశీలన కొనసాగుతుందని రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి..
సైక్లింగ్.. నగరంలో 450కి.మీల దారులు
బడిపిల్లలు.. విజ్ఞానంలో మెరికలు
ప్రకృతి నూనెలు.. ఆరోగ్య ప్రసాదాలు