హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): ఇంటర్బోర్డు ఆదేశాలను పట్టించుకోకుండా కొన్ని ప్రైవేటు కాలేజీలు వక్రమార్గాలను అనుసరిస్తున్నాయి. వేసవి సెలవుల్లోనూ ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు గుంజేందుకు ప్రయత్నిస్తున్నాయి. మంగళవారం నుంచి మే 31 వరకు ఇంటర్బోర్డు వేసవి సెలవులుగా ప్రకటించింది. సెలవురోజుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని ఆదేశాలు జారీచేసింది. 2021-22 విద్యాసంవత్సరాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. జూన్ ఒకటి తర్వాత కాలేజీలు తెరవడం, విద్యాసంవత్సరం కొనసాగింపుపై స్పష్టతనిస్తామని అధికారులు ప్రకటించారు. రీ ఓపెన్ తర్వాత కాలేజీలు 30-40 రోజులు మాత్రమే నడిచాయి. ఈ కొద్ది రోజులకే ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు రూ.50-80 వేలు ఫీజులుగా వసూలుచేశాయి.
ఇవి చాలవన్నట్టు మిగతా బకాయిలను సైతం చెల్లించాలంటూ హెచ్చరికలు జారీచేస్తున్నాయి. ఫీజు బకాయిలు కడితేనే సెకండియర్ ఆన్లైన్ క్లాసులకు అనుమతిస్తామని బెదిరిస్తున్నాయి. ఫస్టియర్ విద్యార్థుల ఇంటర్నల్ మార్కులకు ఫీజులకు లింకుపెట్టి ఇదే తరహా హెచ్చరికలు జారీచేశాయి. ఈ విషయం ఇంటర్బోర్డు అధికారులకు తెలియడం, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో తప్పనిసరై ఇంటర్నల్స్ మార్కులను అప్లోడ్కు సిద్ధపడుతున్నాయి. ఇక సెకండియర్ ఆన్లైన్ క్లాసులను అవకాశంగా తీసుకొని ఫీజుల వసూలుకు తెగబడుతున్నాయి. ఇంటర్బోర్డు అధికారులు ఇలాంటి వాటిని అరికట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే విషయంపై ఇంటర్బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ స్పందిస్తూ.. నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.