హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి అన్ని పాఠశాలలను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బడుల్లో రోజురోజుకు విద్యార్థుల హాజరు శాతం పెరుగుతోంది. మూడో రోజు 30.28 శాతం మంది విద్యార్థులు తరగతులకు హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 42.76 శాతం, ఎయిడెడ్ పాఠశాలల్లో 16.01 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 22.78 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్వోలు, డీపీవోలతో పాఠశాలల ప్రారంభమైన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
పాఠశాలల్లో విద్యార్ధుల నమోదు, టీచర్ల వ్యాక్సినేషన్పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. స్కూలు బస్ డ్రైవర్లు, మద్యాహ్నాభోజన సిబ్బంది, పారిశుధ్ధ్య సిబ్బంది పాఠశాలలకు సంబంధించి ఇతరులకు (వయోజనులు) వ్యాక్సినేషన్ వేయించాలన్నారు.
ప్రతి పాఠశాల వద్ద టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి పూర్తి వ్యాక్సినేషన్ అయిందని, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ పాటిస్తున్నాయని తెలియచేసే బ్యానర్ను ప్రదర్శించాలన్నారు. పాఠశాలల్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్, హైజీన్ చర్యలు పాటించేలా కలెక్టర్లు చూడాలన్నారు. ప్రతి రోజు పాఠశాలను శుభ్రపరచాలన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఇతర సిబ్బంది ఎవరైనా కోవిడ్ లక్షణాలతో ఉంటే వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రి, పీహెచ్సీలకు తీసుకువెళ్లి కోవిడ్ టెస్ట్ చేయించాలన్నారు. ఏదైనా పాఠశాల్లో కోవిడ్ పాజిటీవ్ కేసులు నమోదైతే ఐసోలేషన్ చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజనం సందర్భంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, పీఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ రఘునందన్ రావు, ఇంటర్మీడియట్ విద్యా కార్యదర్శి ఒమర్ జలీల్, సీడీఎంఏ సత్యనారాయణ, పాఠశాల విద్యా డైరెక్టర్ దేవసేన, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు తదితర అధికారులు పాల్గొన్నారు.