వ్యాక్సినేషన్తో ఆ ముప్పును కూడా తప్పించవచ్చంటున్న నిపుణులు దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతున్నదని అనుకొంటుండగానే.. థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉన్నదనే అంచనాలు కలవరపెడుతున్నాయి. ఈసారి పిల్లల మీద ఎక్కువ ప్రభావముంటుందన్న వార్తలు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఒకే జిల్లాలో సుమారు 8 వేలమంది పిల్లల్లో కరోనా లక్షణాలు కనిపించాయన్న వార్తలు దేశవ్యాప్తంగా భయాన్ని మరింత పెంచాయి. తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విపత్కర సమయంలో శాస్త్రవేత్తలు ఓ తీపి కబురు చెప్పారు. పిల్లలకు కరోనా సోకే అవకాశాలు తక్కువేనని.. ఒకవేళ వైరస్ సోకినా వారిపై పెద్దగా ప్రభావం ఉండబోదని స్పష్టంచేస్తున్నారు.
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ):
బలమైన రోగనిరోధక వ్యవస్థ
పెద్దవారితో పోల్చితే పిల్లల్లో సహజ రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఏవైనా సూక్ష్మజీవులు వారి శరీరంలోకి ప్రవేశిస్తే శరీరంలో వేగంగా యాంటి బాడీలు ఉత్పత్తి అవుతాయని కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఇమ్యూనాలజిస్ట్ డొన్నా ఫార్బర్ తెలిపారు. కొవిడ్-19 వైరస్ వచ్చినప్పుడు వారి రోగనిరోధక శక్తి వేగంగా స్పందిస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు పిల్లల్లో నమోదైన కేసుల్లో అసిమ్టమాటిక్ లేదా స్వల్ప లక్షణాలున్న కేసులు అత్యధికంగా ఉన్నాయని అన్నారు. ఇటీవల ఓ కుటుంబంపై అధ్యయనంచేయగా తల్లిదండ్రులకు పాజిటివ్ వచ్చిన తర్వాత వారి ముగ్గురు పిల్లలను పరీక్షించగా నెగెటివ్ వచ్చిందన్నారు. 28 రోజుల్లో 11 సార్లు వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా.. ప్రతిసారి నెగెటివ్ వచ్చిందని, కనీసం వారిలో కరోనా లక్షణాలు కూడా కనిపించలేదని చెప్పారు. ‘మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్’ ఉన్నవారు మాత్రమే తీవ్ర వ్యాధి లక్షణాలు కనిపించినట్టు వెల్లడించారు.
స్పైక్ ప్రొటీన్కు తగిన ప్రతిరక్షకాలు
కొలంబియా వర్సిటీ పరిశోధకులు కొవి డ్బారిన పడిన 32మంది పెద్దలు, 47 మం ది పిల్లలపై ఇటీవల పరిశోధనలు చేశారు. పిల్లల్లోని రోగనిరోధక శక్తి కొవిడ్ వైరస్లోని స్పైక్ ప్రొటీన్ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలను తయారు చేసినట్టు గుర్తించారు. స్పైక్ ప్రొటీన్ను నిర్వీర్యం చేయగలిగితే వైరస్ శరీరంలోని అవయవాల వరకు వెళ్లే అవకాశముండదు. అదేసమయంలో పెద్దల్లోని రోగనిరోధక వ్యవస్థ వైరస్లోని న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్ను ఎదుర్కొనగలిగే ప్రతిరక్షకాలను ఉత్పత్తిచేసింది. వైరస్ తన సంతతిని పెంచుకోవడానికి న్యూక్లియోక్యాప్సిడ్ ప్రొటీన్ ఉపయోగపడుతుంది. పిల్లల్లోని రోగనిరోధక శక్తి వైరస్ను ప్రాథమిక దశలోనే కట్టడి చేస్తున్నది కాబట్టి.. న్యూక్లియోక్యాప్సిడ్ను అడ్డుకొనే ప్రతిరక్షకాలు అవసరం రాలేదు. ఒక వ్యాధికి వ్యతిరేకంగా శాశ్వత ప్రతిరక్షకాలు ఏర్పడితే అవిజీవితాతం ఉంటాయి. శరీరంలోని ‘టీ-సెల్స్’ స్పందించినప్పుడు ఈప్రతిరక్షకాలు ఏర్పడుతాయి. పిల్లల్లో ఉండే టీ-సెల్స్ చురుకుగా ఉండి ఏ వైరస్ వచ్చినా, ఎదురుదాడి చేసి రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తక్కువ మోతాదులో ‘ఏసీఈ-2’
కొవిడ్ వైరస్ ముక్కు, గొంతులోకి ప్రవేశించాక అక్కడ ఉండే శ్లేష్మ పొరలోని ‘ఏసీఈ-2’ అనే రిసెప్టార్లను (ప్రొటీన్లను) అతుక్కుంటాయి. అక్కడి నుంచి కణంలోపలికి ప్రవేశిస్తాయి. తమ సంఖ్య ను పెంచుకొని వ్యాధిని కలిగిస్తాయి. పెద్దలతో పోల్చితే పిల్లల్లో ‘ఏసీఈ-2’ రిసెప్టార్లు చాలాతక్కువ మోతాదులో ఉంటాయి. దీంతో పిల్లల శరీరంలోకి వైరస్ ప్రవేశించే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ ప్రవేశించినా.. అవి తక్కువ సంఖ్య లో ఉంటాయని, వారి రోగ నిరోధక శక్తి వెంటనే స్పందించి ప్రతిరక్షకాలను ఉత్ప త్తి చేస్తుందని వివరించారు. పిల్లలకు కరోనా ముప్పుతక్కువే అయినా.. మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్తో బాధపడుతున్న పిల్లలకు వైరస్ సోకితే తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివారికి టీకాలు వేయడంద్వారా ముప్పును తగ్గించవచ్చని నిపుణులు చెప్తున్నారు. మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్కు అనుగుణంగా టీకాల్లో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పిల్లలు వైరస్ వాహకాలుగా మారే ప్రమాదం ఉన్నది. దీనికి వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే అడ్డుకట్ట వేయగలమని చెప్తున్నారు.