హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ప్రజలు కొవిడ్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ.. రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం, వ్యాక్సినేషన్ అందేటట్లు చూడాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి తగు సూచనలు చేశారు. జిల్లాలో కరోనా కేసుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకుండా కట్టడి చేయాలని సూచించారు.
కరోనా నివారణ చర్యలు పటిష్టంగా చేపట్టాలని, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని చెప్పారు. ఇదే సమయంలో కరోనా బారిన పడ్డ రోగులకు హాస్పిటల్స్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, వెంటిలేటర్లు, ఆక్సిజన్, మందుల కొరత రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.