న్యూఢిల్లీ, మే 23: తౌటే తుఫాన్ నుంచి కోలుకోకముందే ‘యాస్’ రూపంలో మరో తుఫాన్ ముంచుకొస్తున్నది. తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ నెల 26న (బుధవారం) ఉదయం అతి తీవ్ర తుఫాన్గా మారి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాన్ని దాటనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం హెచ్చరించింది. ఉత్తర, వాయువ్య దిశగా కదులుతున్న వాయుగుండం సోమవారానికి తీవ్ర తుఫాన్గా, ఆ తర్వాత 24 గంటల్లో అతి తీవ్ర తుఫాన్గా మారుతుందని వెల్లడించింది. ‘ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ మధ్యలో గల పారాదీప్, సాగర్ దీవుల ప్రాంతాన్ని ‘యాస్’ 26న సాయంత్రం తాకొచ్చు’ అని వివరించింది. ‘యాస్’ తీరాన్ని తాకే సమయంలో గంటకు 155-165 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సంసిద్ధంగా ఉండండి: ప్రధాని మోదీ
‘యాస్’ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులను ఆదేశించారు. ‘యాస్’ తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఆర్ఎఫ్), ఇతర విభాగాల ఉన్నతాధికారులతో మోదీ ఆదివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా తలెత్తే విద్యుత్, కమ్యూనికేషన్ సమస్యలను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొవిడ్-19 రోగులకు చికిత్స, దవాఖానల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు ఆటంకాలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలతో అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలన్నారు. తీర ప్రాంతాల్లో గస్తీ, రక్షణ, సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటికే నౌకలు, హెలికాప్టర్లను ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ, ఎయిర్ఫోర్స్ సిద్ధం చేసిందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పెట్రోలియం, విద్యుత్, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖలు సమస్వయంతో పనిచేస్తున్నట్టు వివరించింది.