నల్లగొండ : లాక్ డౌన్ అమలులో భాగంగా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణ, కేసుల సంఖ్య పెరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఐఈ కార్డుతో పాటుగా విధిగా ఉదయం 10-00 గంటల లోగా కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు. అదే విధంగా సాయంత్రం 5-00 నుంచి 6-00 గంటల సమయం వరకు ఇంటికి చేరుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులకు మినహాయింపు ఉన్నప్పటికీ విధిగా వారి అక్రిడిటేషన్ కార్డులు, సంస్థ జారీ చేసిన ఐడీ కార్డులు వేసుకొని కవరేజ్ చేయాలన్నారు.
విద్యుత్ శాఖ, అత్యవసర సేవల విభాగాలు, లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వబడిన శాఖల వారు వారి వాహనాలకు ముందు స్టిక్కరింగ్ చేసుకోవాలన్నారు. వారి ఐడీ కార్డులు వెంట ఉంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగ కార్మికులు, వ్యవసాయ ఉత్పత్తులు ఉదయం 10.00 లోగా పనుల్లోకి వెళ్లి తిరిగి రాత్రి 9.00 కల్లా ఇండ్లకు చేరుకునేందుకు అనుమతిస్తామని చెప్పారు. డాక్టర్లు, మెడికల్ సిబ్బంది, వైద్య విభాగంలో పని చేసే ఉద్యోగులు వారి ఐడీ కార్డులతో పాటు వాహనాలకు స్టిక్కరింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
అదే విధంగా మెడికల్ ఏజెన్సీల నుంచి మెడికల్ షాపులకు ఔషధాల సరఫరా రాత్రి 7.00 నుంచి ఉదయం 9.00 వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. అదే విధంగా ఈ కామర్స్ విభాగానికి చెందిన స్విగ్గీ, జొమాటో, రిలయన్స్, హెరిటేజ్ సిబ్బంది విధిగా వారి బ్రాండ్స్ తో కూడిన యూనిఫామ్, ఐడీ కార్డు, వెహికిల్ స్టిక్కర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
గూడ్స్ వాహనాలు రాత్రి 9.00 నుంచి ఉదయం 8.00 వరకు మాత్రమే అనుమతిస్తామని ఆ సమయంలోనే నిత్యావసరాలు, ఇతర సరుకుల రవాణా చేయాలని డీఐజీ స్పష్టం చేశారు. లాక్ డౌన్ అమలులో భాగంగా తీసుకుంటున్న కఠిన చర్యలకు అందరూ సహకరించాలన్నారు.
ఇవి కూడా చదవండి..
చెరువులో విష ప్రయోగం..చేపలు మృతి
మెడికల్ హబ్గా వరంగల్ : మంత్రి సత్యవతి రాథోడ్
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి