హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): కొవిడ్ చికిత్స పేరుతో ప్రజ లను ప్రైవేటు హాస్పిటళ్లు మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. కొన్నిచోట్ల డబ్బులు ఇస్తేనే శవాలను ఇస్తామని చెప్పడం దారుణమని అన్నారు. మంగళవారం మంత్రి మల్లారెడ్డితో కలిసి బీఆర్కేభవన్లో మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ చికిత్సల విషయంలో ప్రైవేటు దవాఖానలు ప్రభుత్వ జీవోలు పాటించాలని స్పష్టంచేశారు. ఐసీయూ, పడకల చార్జీలను ప్రభుత్వం సూచించినట్టు వసూలు చేయాలన్నారు. కరోనా పరీక్షల విషయంలోనూ ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు ఇన్సూరెన్స్, ఉద్యోగుల కార్డులను ఆమోదించకపోవడం సరికాదని చెప్పారు.
కొవిడ్ పేషెంట్ చనిపోతే శవం ఇవ్వాల్సిందేనని పదేపదే చెప్తున్నామన్నారు. కష్టకాలంలో ప్రైవేటువాళ్లు వ్యాపార కోణంలో ఆలోచిస్తే సమాజం హర్షించదని హితవుపలికారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. వ్యాక్సిన్ విషయంలో కేంద్రానికి, రాష్ర్టాలకు వేర్వేరు రేట్లు ఉండటం మంచిది కాదని మంత్రి ఈటల అన్నారు. ప్రజల పన్నుల నుంచే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు పెడతాయని చెప్పారు. వ్యాక్సిన్లను రాష్ర్టాలే కొనుక్కోవాలనే ఆలోచనను కేంద్రం పునఃసమీక్షించాలని కోరారు. తెలంగాణ అవసరాలు తీర్చేంతగా రాష్ట్రంలో ఆక్సిజన్ ఉన్నదని మంత్రి తెలిపారు. ముందు చూపుతో వ్యవహరించడం వల్లే కొరత ఏర్పడే అవకాశం లేదన్నారు. ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకాలను సంయుక్తంగా రాష్ట్రంలో త్వరలో అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ దవాఖానల వైద్యులు ఎంతో సేవ చేస్తున్నారని, వారి మనోధైర్యం దెబ్బతినేలా ప్రవర్తించకూడదని సూచించారు.