హైకోర్టుకు తెలిపిన రాష్ట్రప్రభుత్వం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నాలుగైదు జిల్లాల్లో మాత్రమే వైరస్ తీవ్రత అధికంగా ఉన్నదని పేర్కొంది. జీహెచ్ఎంసీ, మేడ్చల్ మల్కాజిగిరీ, రంగారెడ్డి, వరంగల్ అర్బన్, నిజామాబాద్ జిల్లాల్లో గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించింది. కరోనా కట్టడిపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా కరోనా కట్టడికి తీసుకొంటున్న చర్యలను ప్రభుత్వం ధర్మాసనానికి వివరించింది. కరోనా రోగుల చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, రెమ్డెసివిర్ ఇంజక్షన్లను తగినంతగా సరఫరాచేయాలని కేంద్రప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. కరోనా నియంత్రణపై రాష్ట్రప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.