హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలనుననుసరించి లాక్డౌన్ను పటిష్టంగా అమలు చేయాలని పోలీసు అధికారులను రాష్ట్ర డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రేపటి నుండి పది రోజులపాటు ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో అమలుపై డీజీపీ మంగళవారం రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమిషనర్లు, ఎస్పీల నుండి డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్డౌన్ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు.
లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వెలువరించే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాలపై ఏ విధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా విషయంలో కూడా ఏ విధమైన ఆంక్షలు లేవన్నారు. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్డౌన్ నుండి మినహాయించారని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలన్నారు.
కరోనా వాక్సినేషన్కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులను జారీ చేయాలన్నారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు డీజీపీ స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమిషనర్లు, ఎస్పీలు పాసులను జారీ చేస్తారని పేర్కొన్నారు.