హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి కోసం కఠిన చర్యలు తీసుకున్నామని డీజీపీ మహేందర్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. డీజీపీతోపాటు జైళ్లశాఖ డీజీ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. కరోనాపై దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతి ఉంటేనే పిల్లలను పాఠశాలలకు పంపేలా మార్గదర్శకాలు జారీచేస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఆన్లైన్లో హైకోర్టుకు తెలియజేశారు. వారంలోగా మార్గదర్శకాలను తెలియజేయాలని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను జూలై 7కి వాయిదావేసింది. మే 12 నుంచి జూన్ 19 వరకూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై 7,18,678 కేసులు నమోదుచేశామని డీజీపీ తెలిపారు. ఖైదీలకు వ్యాక్సిన్లు వేయించినట్టు తెలిపారు. లాక్డౌన్ వేళ తెల్లకార్డుదారులకు రూ.91.94 కోట్ల వ్యయంతో 3.59 టన్నుల బియ్యాన్ని ఒక్కొక్కరికి 20 కిలోల చొప్పున పంపిణీ చేశామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్కుమార్ అఫిడవిట్లో పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇచ్చామని తెలిపారు. వలస కార్మికులకు అన్నపూర్ణ పథకం కింద ఉచితంగా అన్నం పెట్టామని మున్సిపల్శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మరో అఫిడవిట్లో తెలిపారు. లాక్డౌన్ విధించిన మే 12 నుంచి ఇప్పటివరకు 4,47,866 మంది లబ్ధిపొందారని తెలిపారు.