బంజారాహిల్స్, మే 14: వ్యవసాయ భూమి కొనుగోలు విషయంలో అడ్వాన్స్గా రూ.2 కోట్లు తీసుకుని.. మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పీఎస్లో చీటింగ్ కేసు నమోదయింది. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని వెంకటగిరి సమీపంలోని భగవతినగర్లో నివాసముంటున్న ఎస్.భక్తప్రియ అనే మహిళ రెండేళ్ల క్రితం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఎన్కపల్లి గ్రామంలోని 12 ఎకరాల వ్యవసాయ భూమిని కొనాలనుకున్నారు. ఇందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం. 10లో నివాసం ఉంటున్న ఆ భూమి యజమాని మీర్జా హుస్సేన్ అలీఖాన్తో చర్చల అనంతరం రూ.9.45 కోట్లకు ధర మాట్లాడుకున్నారు.. అడ్వాన్స్గా రూ.2 కోట్లు చెల్లించి.. నిర్ణీత సమయంలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చెప్పారు. ఇదిలా ఉండగా.. గత ఏడాది ప్రారంభంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉండగా.. రెండు నెలలు అదనపు సమయం కావాలని భక్తప్రియ కోరింది. అయితే తనకు డబ్బులు అర్జెంట్గా కావాలని, లేకపోతే మరొకరికి అమ్మేసిన తర్వాత అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బును తిరిగి ఇస్తానంటూ మీర్జా హుస్సేన్ ఆమెకు చెప్పాడు. దీనికి భక్తప్రియ అంగీకరించారు. అయితే స్థలాన్ని వేరొకరికి అమ్మేసి నెలలు గడుస్తున్నా.. తీసుకున్న రూ.2కోట్లు ఇవ్వకపోగా.. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో బాధితురాలు శుక్రవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మీర్జా హుస్సేన్ అలీఖాన్పై ఐపీసీ 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.