ఆదిలాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు. భైంసా పట్టణంతోపాటు మహగావ్ గ్రామంలో శనివారం ఆయన పర్యటించారు. అల్లర్ల కారణంగా నష్టపోయినవారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి ఘటనలతో పేదలు, మధ్యతరగతి ప్రజలు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు అల్లర్ల నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాయని, ఈ ఘటన వెనుక ఏ పార్టీ ప్రమేయం ఉందో అందరికీ తెలుసన్నారు. అల్లరిమూకలు మహగావ్లో టీఆర్ఎస్ కార్యకర్త ఆటోను దహనం చేశారని తెలిపారు. రాజకీయ లబ్ధికోసం కొంతమంది చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి నష్టం జరగకుండా ప్రత్యేక బెటాలియన్ ఏర్పాటుతోపాటు ఓఎస్డీని నియమించాలని సీఎం కేసీఆర్ను, హోంమంత్రిని కోరినట్టు ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.