హైదరాబాద్: మాస్కులు ధరించని వారిపై చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించనివారిపై కేసులు నమోదుచేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పోలీసు, జైళ్లు, శిశు సంక్షేమ శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. గతనెల 20 నుంచి ఈ నెల 5 వరకు 87,890 కేసులు నమోదుచేశామని, రూ.52 కోట్ల జరిమానా విధించామని డీజీపీ తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రంలోని జైళ్లలో ఉన్న ఖైదీలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని జైళ్ల శాఖ డీజీ వెల్లడించారు. 732 మంది ఖైదీలకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని వెల్లడించారు. 6,127 మంది ఖైదీలకు మొదటి డోసు అందించామని చెప్పారు. మరో 1,244 మంది ఖైదీలకు టీకాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు.
కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాగోగులు చూస్తున్నామని శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఒక్కో చిన్నారికి ఒక నోడల్ అధికారిని నియమించామని తెలిపింది. ఆన్లైన్ బోధనకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ హైకోర్టుకు కోర్టుకు సమర్పించారు. విద్యా సంస్థల్లో ఆన్లైన్ తరగతులే నిర్వహిస్తున్నామని చెప్పారు.