నందికొండ, మార్చి 31: నాగార్జునసాగర్ డ్యామ్ కుడికాల్వ తొమ్మిదో తూము గేటు కొట్టుకుపోగా మరమ్మతుల్లో భాగంగా ఎన్నెస్పీ అధికారులు సోమవారం స్టాప్లాగ్ గేటును దించి వృథాగా పోతున్న నీటిని నిలిపివేశారు. గతేడాది సెప్టెంబర్ 13న తూము తెగి కాల్వగేటు ఊడిపోయింది. మర్మమతుల కోసం నది వెనుక భాగం లో స్టాప్లాక్ గేటును దించే ప్రయత్నంలో స్టాప్లాక్ గేటు నీటిలో ఇరుక్కుపోయింది. అప్పట్లో డ్యాం పూర్తిస్థాయిలో నీటితో ఉన్నందున గేటు మరమ్మతు పనులకు ఇబ్బంది తలెత్తింది. ఈ ఏడాది మార్చిలో డ్యాం నీటి మట్టం, ఒత్తిడి తగ్గడంతో మరమ్మతు పనులు చేపట్టారు. ఇరుక్కుపోయిన స్టాప్లాగ్ గేటును నది దిగువ భాగం వరకు దించడంతో 9వ తూము గేటు ద్వారా నీటి విడుదల నిలిచిపోయింది. వారంలోగా కొత్త గేటును అమర్చి, కుడికాల్వ మిగతా గేట్ల మరమ్మతు పనులు చేపట్టనున్నారు. కుడికాల్వకు ఉన్న తొమ్మిది తూము గేట్లతోపాటు ఎడమ కాల్వకు ఉన్న మూడు తూమ్ గేట్లకు రూ.9 కోట్ల అంచనా వ్యయంతో పనులను చేపట్టనున్నట్టు డీఈ పరమేశ్ వెల్లడించారు.