హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆల్లపల్లి మండలం జిన్నెలగూడెంలో పెద్దరాతి యుగంనాటి రాతిపాత్రలు బయటపడ్డాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. ఇటీవల రైతు శంకరం పొలం దున్నుతుండగా రాతి చిప్పలు( కొబ్బరి చిప్ప ఆకారం), రాతి తొట్లు అనేకం బయటపడ్డాయి. పొలాల పక్కనున్న పరుపురాతి బండలపై తొలిచిన నీటితొట్లను గుర్తించారు. ఆ ప్రాంతంలో ఆవాసాలు ఏర్పరుచుకున్న మానవులు నీటి అవసరాలకోసం రాతి చిప్పలు, నీటి తొట్లను ఉపయోగించినట్టు తెలుస్తున్నది. గతంలో సిద్దిపేట జిల్లా వెంకటాపురంలోని మెగా సమాధుల్లో మట్టితో చేసిన నీటిలోటా(జలపాత్ర)ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. వివిధ సైజుల్లో ఉన్న ఈ పాత్రలు నీటి నిల్వకు, చిప్పలు నీరు తాగడానికి వాడుకొని ఉంటారని తెలంగాణ వారసత్వ శాఖకు చెందిన హిస్టరీ భానుమూర్తి అభిప్రాయపడ్డారు. భద్రాద్రి జిల్లాలో పెద్దరాతి యుగంలో మనుషులు జీవించి ఉంటారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ రామోజు హరగోపాల్ తెలిపారు.