హైదరాబాద్/మాదాపూర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఆర్థికంగా చేయూత అందించాల్సిన అవసరం ఎంతో ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో మంగళవారం తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ ఇండస్ట్రీ (టీసీఈఐ) నాలుగో స్త్రీశక్తి అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వాణీదేవితో కలిసి అమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఒక మహిళకు అవార్డు ఇచ్చామంటే ఆమెను ఆదర్శంగా తీసుకునే పిల్లలకు, కుటుంబానికి కూడా అవార్డు ఇచ్చి ప్రోత్సహించినట్టేనని చెప్పారు. దేశవ్యాప్తంగా సూక్ష్మ, మధ్యతరగతి పరిశ్రమల్లో ఆరు కోట్ల మంది పారిశ్రామికవేత్తలు ఉంటే, 15 శాతం మాత్రమే మహిళల భాగస్వామ్యంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఇందులో 80 శాతం సొంతంగా వ్యాపారాలను నిర్వహిస్తుండగా, మిగిలిన 20 శాతం ప్రైవేటు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో పరిశ్రమలు నడుపుతున్నారని వివరించారు. పారిశ్రామిక రంగంలో ప్రవేశించాలనుకునే మహిళలకు, యువతకు అన్ని రకాల సలహాలు అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మహిళా పారిశ్రామికవేత్తలను కోరారు. అంతర్జాతీయ గైనకాలజిస్టుల అసోసియేషన్కు కార్యదర్శిగా ఎంపికైన తెలుగు మహిళ డాక్టర్ శాంతికుమారిని ఈ సందర్భంగా అభినందించారు. టీసీఈఐ, వీ-హబ్ సంయుక్తంగా నిర్వహించనున్న ‘మెంటర్ మీ’ ప్రోగ్రాంకు సంబంధించిన లోగోను ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్సీ వాణిదేవి, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీసీఈఐ అధ్యక్షరాలు రాఖీ కంకర్యా, వీ-హబ్ సీఈవో దీప్తి రావులతో కలిసి బతుకమ్మ ఆడారు.
40 మందికి అవార్డులు ప్రదానం
స్త్రీ శక్తి అవార్ట్స్ 2021కు రాష్ట్రవ్యాప్తంగా 150 దరఖాస్తులు రాగా.. స్త్రీశక్తి, స్త్రీమూర్తి, స్త్రీరత్న ఈ మూడు క్యాటగిరీల్లో మొత్తం 40 మందిని ఎంపిక చేశారు. మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ వినోభాదేవికి స్త్రీరత్న, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుష్పలతా దేవికి స్త్రీమూర్తి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనూషకు స్త్రీశక్తి అవార్డులను ఎమ్మెల్సీ కవిత అందజేశారు. మిగిలిన వారికి ఎమ్మెల్సీ వాణిదేవి, స్మితా సబర్వాల్, వాకాటి కరుణ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.