హైదరాబాద్ : కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయం లేకుండా భారతదేశం లేదు. రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతుధరపై కేంద్రం చట్టం చేయాలని అన్నారు. మార్కెటింగ్, ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్క్ ఫెడ్, హాకా సంస్థలపై హిమాయత్ నగర్ మార్కెటింగ్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షకు మంత్రి హాజరై మాట్లాడారు.
కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో గతంలో లాగా రాష్ట్ర వ్యవసాయ చట్టం, నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలన్నారు. వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ ఫీజు పకడ్బందీగా వసూలు చేయాలి. చెక్ పోస్టులు అన్నింటినీ బలోపేతం చేయాలని పేర్కొన్నారు.
రాబోయే కాలంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో మార్కెట్లలో వసతులు సమకూర్చాలి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున చర్చ జరుగాలని మంత్రి సూచించారు. పప్పుగింజలు, నూనెగింజలు అధికంగా సాగు చేయాలి. కోహెడలో అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు.
జగిత్యాల మామిడి ముంబయికి వెళ్తుంది. కొల్లాపూర్ మామిడికి అక్కడే మార్కెట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మార్కెట్ మీద వత్తిడి తగ్గుతుందన్నారు. హైదరాబాద్ మార్కెట్ కు వచ్చేది ప్రధానంగా దక్షిణ తెలంగాణ మామిడి అన్నారు.
ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యల తీసుకోవాలన్నారు. దీనిపై వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వరంగల్, ఖమ్మంలలో మిరప ట్రేడింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు
తీసుకుంటామన్నారు. యాసంగి సాగుకు సరిపడా ఎరువుల సన్నద్ధతపై సమీక్షించారు. వివిధ ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలలకు నిత్యావసర వస్తువుల సరఫరా దిశగా హాకా ఆలోచించాలన్నారు. శ్రీగంధం సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. అలాగే పట్టణప్రాంతాల చుట్టూ కూరగాయల సాగు పెంపుపై దృష్టి సారించాలన్నారు.
వేర్ హౌసింగ్ గోదాముల నిర్మాణం వేగవంతం చేయాలి. ఏ ఇబ్బందులున్నా వెంటనే నా దృష్టికి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.