హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా విలయతాండవంతో వందలాది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.. ప్రాణం నిలిపే ప్రాణవాయువును అడ్డగించి మనిషి జీవాన్ని తీస్తూ పైశాచికానందం పొందుతున్నదీ వైరస్. దాన్నుంచి కాపాడుకోవడానికి ఆక్సిజన్ అవసరం ఏర్పడింది.. దానికి డిమాండ్ పెరిగింది.. అదేసమయంలో కొరత కూడా ఏర్పడింది. దీంతో ఎన్నో పరిశ్రమలు ఆక్సిజన్ను అందించడానికి ముందుకువస్తున్నాయి. క్లిష్ట సమయంలో మానవత్వం చూపుతూ మహమ్మారి బారినుంచి ప్రాణాలను నిలుపుతున్నాయి. ఆక్సిజన్ కొరత ఏర్పడిన వెంటనే కేంద్రం స్టీల్ కంపెనీలను ఆక్సిజన్ సరఫరా చేయాలని కోరింది. దీంతో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐఎల్) తమ ఆధీనంలోని ఐదు ప్లాంట్ల నుంచి 35 వేల టన్నుల 99.7శాతం స్వచ్ఛమైన లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేసింది. గత ఐదురోజుల్లో ప్రతిరోజూ 600 టన్నుల చొప్పున లిక్విడ్ ఆక్సిజన్ను అందించింది.
టాటాస్టీల్ రోజుకు 200-300 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను, ఆర్సెలర్ మిట్టల్ 200 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నాయి. మహారాష్ట్రకు 100 టన్నుల ఆక్సిజన్ను ఉచితంగా ఇవ్వనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ హామీ ఇచ్చింది. అంతేకాకుండా మధ్యప్రదేశ్లోని ఇండోర్కు 60 టన్నుల ఆక్సిజన్ను పంపినట్టు తెలిపింది. అమెరికా, జర్మనీ, సింగపూర్ తదితర దేశాల నుంచి ఆక్సిజన్ సరఫరాకు అవసరమయ్యే సిలిండర్లు, ఇతర యంత్రసామాగ్రిని దిగుమతి చేసుకునేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. దీనికోసం మూడు నెలల పాటు ఆక్సిజన్ సహా దాని సంబంధిత పరికరాల దిగుమతిపై ఎక్సైజ్ సుంకాన్ని రద్దుచేసింది.
ఇటు రైల్వేశాఖ.. అటు వాయుసేన
రైల్వేశాఖ ఆక్సిజన్ సరఫరాకు ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ పేరుతో రైలును ప్రారంభించింది. గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేస్తూ, ఆక్సిజన్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నది. అత్యధికంగా వైరస్కు ప్రభావితమవుతున్న మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గడ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ర్టాలకు ఈ నెల 30 నాటికి 17వేల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. రక్షణశాఖకు చెందిన సైనిక విమానాలు, హెలికాప్టర్లు ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణాలో పాల్గొంటున్నాయి.