హైదరాబాద్ : నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం ప్రగతి భవన్లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీరాజ్ అధికారుల (డీపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సీఎం సుధీర్ఘంగా సమీక్షించారు.
జిల్లా, మున్సిపల్, మండలస్థాయి ఇంటర్ డిపార్ట్మెంటల్ కో ఆర్డినేషన్ మీటింగ్స్ నిరంతరం నిర్వహించాలని సీఎం తెలిపారు. పట్టణ స్థానిక సంస్థలు నాటే మొక్కల విషయంలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్లు సర్టిఫై చేయాలన్నారు. కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల ప్రజాప్రతినిధులు, అధికారులకు ఓరియంటేషన్ క్లాసులను రెగ్యులర్ గా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో మహిళలకు ఇబ్బంది లేకుండా పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉందో స్టడీ చేయడానికి మూడు, నాలుగు దేశాలకు ఒక అధికారుల టీమ్ ను పంపించాలని మంత్రికి సూచించారు.
మిషన్ భగీరథ త్రాగునీరు పట్టణాలకు బల్క్ సప్లై పూర్తి స్థాయిలో అందుతున్నదని ఐతే, అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల ఏర్పాటు విషయంలో అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు సికింద్రాబాద్లోని మోండా మార్కెట్, గజ్వేల్లోని సమీకృత మార్కెట్ను పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు.
పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. లే అవుట్లల్లో కమ్యూనిటీలకు కేటాయించిన కమ్యూనిటీ హాల్, ట్రాన్స్ ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే అవుట్ యజమానులు తర్వాత అమ్ముకుంటున్నట్లు తెలిపారు. వాటిని ముందే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పట్టణాలు ఒక క్రమపద్ధతిలో అభివృద్ధి చెందేలా నిబంధనలకు అనుగుణంగా లే అవుట్లు ఉండేలా, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
పట్టణాలల్లో పూర్తి స్థాయిలో ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయాలని, దీని వల్ల విద్యుత్ బిల్లుల ఖర్చు తక్కువగా రావడం సంతోషకరమని సీఎం అన్నారు. నగరాలు, పట్టణాల్లో రోడ్ల విస్తరణకు సంబంధించి మాస్టర్ ప్లాన్ లో డైనమిక్ అప్డేషన్ చేయాలన్నారు. ప్రజా అవసరాల కోసం నగరాలు, పట్టణాల్లో ప్రభుత్వ ల్యాండ్ రికార్డ్స్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని సీఎం పేర్కొన్నారు.