వేములవాడ టౌన్, మార్చి 12 : మహా శివరాత్రి జాతర సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వేములవాడలో హెలీకాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. మూడు రకాల ప్యాకేజీలతో ఈ నెల 10న సేవలను ప్రారంభించారు. రేపటి దాకా అవకాశం కల్పించారు. ఒక్కో ట్రిప్పులో ఆరుగురు ప్రయాణించే అవకాశం ఉండగా, బుధ, గురు, శుక్రవారాల్లో 130 మంది గగన విహారం చేశారు. వేములవాడతోపాటు నాంపల్లి, శ్రీరాజరాజేశ్వర జలాశయం అందాలను వీక్షించారు. మరుపురాని అనుభూతిని మూటగట్టుకున్నారు. వీడియోలు, సెల్ఫీలు తీసుకొని ఆనందడోలికల్లో మునిగిపోయారు. హెలీకాప్టర్ సేవలను ఆదివారం వరకు కొనసాగించనుండగా, బుకింగ్ కోసం 9400399999, 7483432752, 9980005519, 9544444693 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిచిపోలేను..
నాకు 80 ఏండ్లు.ఈ వయసుల ఇలా హెలీకాప్టర్ ఎక్కడం అద్భుతంగా అనిపించింది. పైన తిరుగుతున్నంత సేపు మానేరు అందాలను చూసి తరించిపోయా. నా కొడుకు ఇలా హెలీకాప్టర్ ఎక్కించడం అదృష్టంగా భావిస్తున్నా. రాజన్న గుడి చెరువు, గోపురాలు, నాంపెల్లి గుట్ట అందాలు చూస్తే చాలా మంచిగనిపించింది.