హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశానికే ఆదర్శంగా నిలిచే మెగా సామూహిక గృహ సముదాయం.. అబ్బుర పరిచే ఆత్మగౌరవ సౌధం.. కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని కొల్లూరులో రూ.1,408.09 కోట్లతో ప్రభుత్వం ఎస్+9, ఎస్10, ఏ+11 అంతస్తుల్లో 15,600 ఇండ్లను అత్యున్నత ప్రమాణాలతో ఆదర్శ టౌన్షిప్గా నిర్మించింది. ఈ పేదల కలల సౌధాన్ని త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేయనున్నామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. కొల్లూరులో ఒకేచోట 15,600 రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం చేపట్టామని, అతిపెద్ద ఆత్మగౌరవ వేదికగా నిలవనున్నదని పేర్కొన్నారు. ఔటర్ను ఆనుకుని నిర్మాణమైన గృహ సముదాయం అబ్బురపరిచేలా ఉన్నదని తెలిపారు.
9 నెలల్లో 55 వేల ఇండ్లు పూర్తి
రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం ఈ ఏడాది మరింత ఊపందుకున్నది. గత ఆరునెలలుగా ఇండ్ల నిర్మాణంతోపాటు గృహ ప్రవేశాలు జోరందుకున్నాయి. పథకం మొదలైనప్పటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 55 వేల పైచిలుకు ఇండ్ల నిర్మాణం పూర్తయింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేల ఇండ్లు లబ్ధిదారులకు చేరుతున్నాయి. రాష్ట్రంలో 2.91 లక్షల ఇండ్లు నిర్మించాలనేది లక్ష్యం కాగా.. ఇప్పటికే సర్కారు 1.77 లక్షల ఇండ్ల నిర్మాణాలు పూర్తిచేసింది. లక్ష్యంలో దాదాపు 61% పూర్తయ్యాయి. ఈ పథకం అంచనా వ్యయం రూ.19,079.60 కోట్లు కాగా ఇప్పటివరకు దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చుచేశారు.