హైదరాబాద్ : రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఎ. శరత్ ఆదివారం హైదరాబాద్ లోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో నూటికి 60 శాతం పైన ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని తెలిపారు. గ్రామాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధని మంత్రి పేర్కొన్నారు.
అందుకే రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, వివిధ గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ గ్రామీణ అభివృద్ధి పథకాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు కావటానికి అహర్నిశలు కృషి చేయాలని మంత్రి సూచించారు.