ఒకప్పుడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. నేడు అదే అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో నిరాదరణకు గురైన తెలంగాణ.. స్వరాష్ట్రంలో అందరికీ ఆదర్శంగా ఎదిగింది. పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో ఇప్పుడు కార్పొరేట్ల చూపు తెలంగాణ వైపే. ఇక్కడ తమ కార్యాలయం ఉండటం ఓ బ్రాండ్గా అన్ని సంస్థలు భావిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. అవును.. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలు తెలంగాణకు దేశ, విదేశీ ఖ్యాతిని తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మౌలిక సదుపాయాలు..పెట్టుబడుల వరదను సృష్టిస్తున్నాయి.
2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణకు మూడో స్థానం
దేశంలో నివాసం, ఉపాధికి అనుకూలమైన నగరాలపై హోలిడిఫై.కామ్ సర్వేలో రాష్ర్టానిదే అగ్రస్థానం
‘కన్వర్జెన్స్ ఇండియా-2021’ పేరుతో ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన 28వ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, స్మార్ట్ వేస్టేజ్ డిస్పోజల్, స్టార్టప్ల విభాగంలో హైదరాబాద్కు మూడు అవార్డులు
దేశంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎంపిక చేసిన అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత వేగంగా స్మార్ట్ సిటీగా ఎదుగుతున్న నాలుగు నగరాల్లో హైదరాబాద్
నీతి ఆయోగ్ విడుదల చేసిన పర్ఫార్మెన్స్ ఇన్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో తెలంగాణకు మేజర్ స్టేట్స్ కేటగిరీలో 4వ స్థానం
పీఎం స్వనిధి రుణాలకు దరఖాస్తులను తీసుకోవడం, రుణాలను మంజూరు చేయడంలో హైదరాబాద్కు దేశంలోనే తొలి స్థానం
2020-21లో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో రాష్ట్ర వృద్ధిరేటు ఏకంగా 20.9 శాతంగా నమోదైంది. ఇదే సమయంలో జాతీయ వృద్ధిరేటు కేవలం 3 శాతమే. అంటే తెలంగాణ సుమారు ఏడు రెట్లు అధిక వృద్ధిని సాధించింది. ఇక పరిశ్రమలు, సేవా రంగాల్లోనూ జాతీయ గణాంకాలతో చూస్తే రాష్ట్ర పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అలాగే జీఎస్డీపీతో పోల్చినప్పుడు తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 20.6 శాతంగా నమోదవడం గమనార్హం. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే అత్యధికం కావడం విశేషం. ఇందులో సేవా రంగం 60.3 శాతం, పరిశ్రమల రంగం 19.1 శాతం వాటాను నమోదు చేశాయి.
కరోనా సంక్షోభంలోనూ తెలంగాణలో ఆర్థిక వృద్ధిరేటు జాతీయ వృద్ధిరేటు కన్నా మెరుగ్గా నిలిచింది. 2020-21లో రాష్ట్ర జీఎస్డీపీ విలువ రూ.9.78 లక్షల కోట్లుగా నమోదైంది. స్థిర ధరల వద్ద ఇది మైనస్ 1.26 శాతంగా ఉండగా, ప్రస్తుత ధరల వద్ద +1.35 శాతంగా ఉన్నది. ఇదే సమయంలో దేశ జీడీపీ 2020-21లో మైనస్ 7.3 శాతంగా ఉన్నది. దీనితో పోల్చితే
తెలంగాణ ఎంతో ముందున్నైట్లెంది.
తెలంగాణ ప్రభుత్వం 2014లో టీఎస్ఐపాస్ను ప్రవేశపెట్టింది. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేయడంతోపాటు నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వకుంటే ఆటోమెటిక్గా వచ్చేలా వ్యవస్థను రూపొందించారు. దరఖాస్తు నుంచి మొదలు.. పేమెంట్లు, పత్రాల అప్లోడ్, అనుమతుల మంజూరు వరకు మొత్తం ఆన్లైన్లోనే ప్రక్రియ సాగుతుంది. ఇది జాతీయంగా, అంతర్జాతీయంగా పారిశ్రామిక వర్గాలను ఆకర్షించింది. టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటివరకు 15,852 యూనిట్లకు అనుమతులు ఇచ్చారు. ఇందులో 12,198 యూనిట్లు ప్రారంభమైయ్యాయి. వీటి ద్వారా 7.71 లక్షల మందికి ఉపాధి లభించింది. మొత్తంగా టీఎస్ఐపాస్ ద్వారా రాష్ర్టానికి రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకింగ్స్లో తెలంగాణ టాప్-3లో నిలిచింది. 12 రకాల చట్టాలకు సంబంధించి 180 సంస్కరణలకుగాను తెలంగాణ 99 శాతం పూర్తి చేసింది. కార్మిక రంగం, భూ రికార్డుల నిర్వహణ, వివాదాల పరిష్కారం, నిర్మాణ అనుమతులు, సింగిల్ విండో వ్యవస్థ, ఇంటింటికీ విద్యుత్తు, పన్నుల వసూలు తదితర అంశాల్లో తెలంగాణ సత్తా చాటింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్-2020కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 15 విభాగాలకు చెందిన 301 సంస్కరణలను లక్ష్యంగా విధించింది. ఈసారి వినియోగదారులు ఇచ్చిన స్పందన ఆధారంగా ర్యాంకులు నిర్ణయించనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆయా సంస్కరణలను అమలు చేయడంతోపాటు ఇందుకు సంబంధించిన ఆధారాలను అప్లోడ్ కూడా చేసింది.
తెలంగాణకు దేశ, విదేశీ పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. ఇక్కడున్న ప్రముఖ కార్పొరేట్ సంస్థలే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈ వెబ్సైట్ను గతేడాది జూలైలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, జగదీశ్రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఇది పెట్టుబడిదారులకు తెలంగాణలోగల అవకాశాలను వివరిస్తుంది. వివిధ రంగాల్లో ఉన్న అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు కావాల్సిన పత్రాలు, ఎక్కడెక్కడ భూములు అందుబాటులో ఉన్నాయి? వంటి అంశాలను తెలియపరుస్తుంది. అంతేకాదు.. అవసరాన్నిబట్టి ప్రభుత్వ అధికారులతో సమావేశాన్నీ ఏర్పాటు చేస్తుంది. పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిస్తే ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తుంది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రోడ్షోలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.
తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎస్ఐఐసీ) ఎంతో ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ రోడ్లు, విద్యుత్ సరఫరా వంటి మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నది. ఇలా గతేడాది మొత్తం 10 ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేసింది. 810 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ పార్కుల్లో 450కిపైగా కంపెనీలను నెలకొల్పవచ్చు. ఈ క్రమంలో రూ.6వేల కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని అంచనా. సుమారు 8వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉన్నది. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామం వద్ద నిర్మించనున్న ఐటీ పార్క్కు ముఖ్యమంత్రి కేసీఆర్ గతేడాది డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
వివిధ కారణాలతో మూసివేసే దశకు చేరిన లేదా మూసివేసిన కంపెనీలను పునరుద్ధరించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ (టీఐహెచ్సీఎల్) కొవిడ్-19 సవాళ్లను సమర్థంగా ఎదుర్కొన్నది. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం 275 ఎంఎస్ఎంఈలకు రూ.95.5 కోట్ల సహాయం అందించింది. 1766 మంది ఉద్యగాలను కాపాడింది.
ఏయిరో స్పేస్ రంగంలో రాష్ట్రం దూసుకుపోతున్నది. దీనికి గుర్తింపుగా 2020లో కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ తెలంగాణకు ‘ఉత్తమ రాష్ట్రం’అవార్డును బహూకరించింది. ఈ ఏడాది ఎఫ్డీఐ ఏరోస్పేస్ గ్లోబల్ సిటీస్ ర్యాంకింగ్స్లో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది కరోనా విజృంభణతో ప్రపంచవ్యాప్తంగా ఎయిరోస్పేస్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. హైదరాబాద్లోని విమానయాన పరిశ్రమలు సైతం ఉత్పత్తిని తగ్గించాయి. ఇలాంటి సమయంలోనూ బోయింగ్, సాఫ్రాన్ వంటి సంస్థలు హైదరాబాద్లో పెట్టుబడులతో ముందుకు రావడం శుభ పరిణామం.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా తెలంగాణ ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో ప్రత్యేక పాలసీని ప్రకటించింది. విద్యుత్ వాహనాలను తయారు చేసే కంపెనీల కోసం పలు రాయితీలను ప్రకటించింది. ప్లాంట్ల ఏర్పాటుకు 3,800 ఎకరాల్లో ప్రత్యేక క్లస్టర్ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కీలకంగా మారనున్నాయి. టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది బండ తిమ్మాపూర్, బండమైలారంల ప్రారంభించిన ఫార్క్లు పరిశ్రమలతో నిండిపోయాయి. రూ.1500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) కరోనా కష్టకాలంలోనూ సమర్థంగా పనిచేసింది. 250కిపైగా కొత్త కంపెనీలు ఈ పోర్టల్లోకి చేరాయి. 4వేలకుపైగా ఉద్యోగాలను కల్పించింది. గతేడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య (లాక్డౌన్ సమయంలో) 30కిపైగా కంపెనీల నుంచి 2,500కుపైగా ఇంటర్వ్యూలు నిర్వహించింది.