హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్ ఫార్ములా ఎంతో ముఖ్యమైంది. ఇందులో టెస్టింగ్పై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్రప్రభుత్వం.. ప్రతిరోజు పెద్దసంఖ్యలో నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నది. దేశంలోనే అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ప్రతి పది లక్షల మందిలో కనీసం 140 మందికి కొవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించాలి. దీని ప్రకారం.. తెలంగాణలో కనీసం 5,600 మందికి పరీక్షలు నిర్వహించాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం రోజుకు లక్షా 30 వేల పరీక్షలు నిర్వహిస్తున్నది. పరీక్షల సంఖ్యను కూడా క్రమంగా పెంచుతున్నది. ఏప్రిల్ 15న తీసుకున్న లెక్కల ప్రకారం.. దేశంలో ప్రతి పది లక్షల మందిలో సరాసరిగా 2,044 మందికి పరీక్షలు జరుగగా, తెలంగాణలో మాత్రం 3,703 మందికి పరీక్షలు నిర్వహించారు. ఢిల్లీ, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకసహా మొత్తం 16 రాష్ట్రాలు ఈ విషయంలో తెలంగాణ కంటే వెనుకబడ్డాయి. కొన్ని రాష్ట్రాలు జాతీయ సగటు కంటే అతి తక్కువగా పరీక్షలు నిర్వహించాయి.
25 శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు
తెలంగాణలో ఇప్పటివరకు 1.19 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 25శాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఉన్నాయి. మొదటి వేవ్లో తక్షణం ఫలితాలు తెలుసుకునేందుకు ఉపయోగపడే ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లను పెద్దమొత్తంలో ప్రభుత్వం దిగుమతి చేసుకున్నది. కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఆర్టీపీసీఆర్ పరీక్షలను క్రమంగా పెంచింది. అత్యాధునిక కోబాస్ మిషన్ను సైతం కొనుగోలు చేసింది. దీంతో ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య క్రమంగా పెరిగింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు 50 శాతం ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 33 కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నది. ఇప్పటికే సిద్దిపేట, మహబూబ్నగర్, నల్లగొండ, వరంగల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. త్వరలో మరిన్ని జిల్లాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
రాష్ట్రం టెస్ట్ ఫర్ మిలియన్
తెలంగాణ 3,703
మహారాష్ట్ర 2,044
కేరళ 2,978
కర్ణాటక 2,246
తమిళనాడు 1,554
ఏపీ 725
ఢిల్లీ 3,497
ఉత్తరప్రదేశ్ 1,008
పశ్చిమబెంగాల్ 473
ఛత్తీస్గఢ్ 1,560
రాజస్థాన్ 835
గుజరాత్ 2,505
మధ్యప్రదేశ్ 645
ఒడిశా 782
హర్యానా 1,495
బీహార్ 919
పంజాబ్ 1,540